- బీఆర్ఎస్, కాంగ్రెస్కు వ్యతిరేకంగా వారు కదులుతున్నారు..
- యువతను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ది..
- తెలంగాణ వెనకబాటుతనానికి కారణం కాంగ్రెస్ పార్టే..
- ఇరు పార్టీలపై ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి..
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు..
హైదరాబాద్ : రాష్ట్రంలో నిశ్శబ్ధంగా ఉన్న యువత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యువతను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ది అయితే.. తెలంగాణ వెనకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టేనని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దపల్లికి చెందిన బీఆర్ఎస్ జెడ్పీటీసీ సంధ్యారాణితో పాటు పలువురు సింగరేణి కార్మికులు.. కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలోకి చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. యువతను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ ది అయితే.. తెలంగాణ వెనుకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో పర్యటిస్తుందని వివరించారు. డబుల్ బెడ్ రూం పంపిణీ పేరుతో పేదలను, రుణమాఫీ పేరుతో రైతులను , మూడెకరాల భూమి పంపిణీ చేస్తానని దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. లక్షలాది దళిత కుటుంబాలుంటే.. కేవలం బీ.ఆర్.ఎస్. కార్యకర్తలకే పథకం ఇచ్చుకుంటూ అందరికి ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. గిరిజనబంధు ఇస్తానని చెప్పి అది ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని.. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం అమలు చేయాల్సిన రిజర్వేషన్లు పేపర్ కే పరిమితమైందని దుయ్యబట్టారు. విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మహిళల పొదుపు సంఘాలకు పావలా వడ్డీతో రుణాలు ఇవ్వలేదన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని అటకెక్కించరన్నారు. విద్య, వైద్య రంగానికి బడ్జెట్ లో నిధులు తగ్గించారన్నారు. నేడు ఎన్నికల వేళ ఓట్లకోసం కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు కావడానికి కారణం కాంగ్రెస్ పార్టేనని దుయ్యబట్టారు. తెలంగాణ వెనకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీ.ఆర్.ఎస్., కాంగ్రెస్ కు సరైన బుద్ధి చెబుతారని స్ఫష్టం చేశారు.