- కాసులిస్తేనే కనికరిస్తారా:?
- ముచ్చటగా మూడుసార్లు పెన్షన్ దరఖాస్తు శ్రీ పట్టించుకోని అధికారులు
పాలకవీడు : రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి..!మూడు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాము.అధికారులు మారుతున్నారే తప్ప నా పెన్షన్ సమస్యకు మోక్షం కలగడం లేదు.మూడుసార్లు దరఖాస్తు సమర్పించినా కనికరించలేదు. దరఖాస్తు ఇచ్చినప్పుడల్లా ఎంతోకొంత దక్షిణం చెల్లించాల్సిందే.సంబంధిత జిల్లా అధికారులు నేను 100% వికలాంగుడినని 2021 లో సదరం సర్టిఫికెట్ ఇచ్చినా కూడా ఎందుకు నాకు పెన్షన్ రావడంలేదంటూ ప్రశ్నిస్తున్నాడు సూర్యాపేట జిల్లా, పాలకవీడు మండలం,జాన్ పహాడ్ గ్రామపంచాయతీకి చెందిన జిట్టబోయిన. ఉపేందర్ వయస్సు 10 సం’’లుపుట్టుకతోనే మతిస్థిమితం లేక మానసిక వికలాంగుడిగా పుట్టి కుటుంబానికి భారమై తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితిలో ఉన్నాడు.తల్లిదండ్రులు కూలి నాలి చేసుకుంటే కానీ పూట గడవదు.అలాంటి పరిస్థితులలో ఉపేందర్ దగ్గర ఎవరో ఒకరు ఉండవలసి వస్తుంది.కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డపై ఎన్నో కలలు కని పెద్ద చదువులు చదివించి గొప్ప ప్రయోజకుడుని చేయాలని ఆశతో బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి.వృద్ధాప్యంలో తమకు సేవలు అందించాల్సిన బిడ్డ కళ్ళముందు మానసిక వికలాంగుడిగా ఉండడంతో తల్లిదండ్రులే బిడ్డకు సేవ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వారు కన్నీరు మున్నీరవుతున్నారు.ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధలు మాటల్లో వినలేము,కళ్ళతో చూడలేము.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు.
నా కొడుక్కి పెన్షన్ ఇప్పించండి:
మాది నిరుపేద కుటుంబం..!కూలినాలి చేసుకొని బతుకుతున్నాం.ఇంటి పట్టే ఉండే నా బిడ్డను చూసుకోవాలి.మానసిక వికలాంగుడని డాక్టర్లు,జిల్లా సంబంధిత అధికారులు 100%తో కూడిన సర్టిఫికెట్ జారీ చేశారు.పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసినా ఫలితం లేదు. అధికారులు దయదలచి నా కొడుక్కు పెన్షన్ మంజూరు చేయగలరు.