- ప్రగతిభవన్ వేదికగా జరిగిన కార్యక్రమం..
- వాహన, ఆయుధ పూజల నిర్వహణ..
- నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..
- విజయం సిద్దించాలని ఆశీర్వదించిన వేదం పండితులు..
హైదరాబాద్ : విజయదశమి వేడుకలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శవిూపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్ధతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు. శుభసూచకంగా భావించే పాలపిట్టను సీఎం దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని సీఎం పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరకీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.