- అభ్యర్థుల నగదు ట్రాన్స్ ఫర్స్ పై ఆరా..
- ప్రతీ అంశంపై దృష్టిపెడుతున్న వైనం..
- గూగుల్ పే, ఫోన్ పే లపై సీరియస్..
- రాజకీయ పార్టీల అకౌంట్స్ పై కన్ను..
- ఇప్పటికే తనిఖీల్లో కోట్లాది రూపాయలు స్వాధీనం..
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రతీ అంశంపై ప్రత్యేక దృష్టిపెడుతోంది. ప్రధానంగా నగదు బదిలీలపై దృష్టిసారించింది. ఇప్పటికే పోలీసుల తనిఖీల్లో కోట్లాది రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా డిజిటల్ పేమెంట్స్పై ఫోకస్ పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేలో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై ఈసీ సీరియస్ యాక్షన్కు పూనుకుంది. ఇందులో భాగంగానే వ్యక్తిగత ఖాతాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఖాతాలపై ఈసీ కన్నేసింది. ఇందులో భాగంగా ఆయా బ్యాంకులతో ఎన్నికల సంఘం వరుస భేటీలు నిర్వహిస్తోంది. రోజువారీగా అనుమానిత, ఎక్కువ మొత్తంలో నగదు చెలామణి అవుతున్న ఖాతా లిస్ట్ను ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఎన్నికల అధికారితో పాటు సీఈవోకు కూడా లిస్ట్ పంపాలని సూచించింది. ఒకే ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయ్యే ఖాతాలపై ప్రధానంగా ఓ కన్నేసి పెట్టింది.