భోపాల్ : కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడి వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. మంత్రి కుమారుడు కోట్లాది రూపాయల డబ్బు గురించి మాట్లాడటం అందులో కన్పించింది. దీనిపై వెంటనే విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు దేవేందర్ సింగ్ తోమర్ లంచం డిమాండ్ చేయడం, కోట్లాది రూపాయల లావాదేవీల గురించి మాట్లాడటం స్పష్టంగా కనబడుతున్నదని, దీనిని ఈసీ తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు.