- ప్రధాని మోడీకి కితాబిచ్చింది షారుఖ్ ఖాన్..
ముంబై : ప్రస్తుతం ఎక్కడ చూసినా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా పేరే వినిపిస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 7)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ సగటున రోజుకు 100 కోట్లు వసూలు చేస్తోంది. మూడురోజుల్లోనే రూ.350 కోట్లు కలెక్ట్ చేసిన జవాన్ 1000 కోట్ల మార్కును ఈజీగా అధిగమిస్తుందంటున్నారు షారుక్ ఫ్యాన్స్. తమ అభిమాన హీరోకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అట్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన జవాన్లో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. జవాన్ సినిమా సంగతి పక్కన పెడితే.. గత కొన్ని రోజులుగా అందరి నోళ్లల్లో నానుతున్న పేరు జీ20. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ సమావేశాల్లో అతిరథ మహారథులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో సహా వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు ఈ గ్లోబల్ సమ్మిట్లో సందడి చేశారు. ఈ నేపథ్యంలో జవాన్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ జీ 20 సమావేశాలపై స్పందించారు. ఈ సందర్భంగా సమావేశాలను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని కూడా అభినందించారు. జీ20 సమ్మిట్కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన షారుక్.. ‘ G-20కి నాయకత్వం వహించినందుకు గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక అభినందనలు. ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల వివిధ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి. వాటి భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుంది. ఈ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోడీని చూసి భారతీయులందరూ గర్వపడుతున్నారు. మీ నాయకత్వంలో వసుదైక కుటుంబంగా అందరమూ ఐక్యంగా ఉంటాం’ అని రాసుకొచ్చారు షారుక్. అలాగే ఈ సమావేశంలో ప్రతిపాదించిన వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే అంశాలను మరోసారి గుర్తుకు తెచ్చారీ స్టార్ హీరో.