సికింద్రాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి నాయకుడు మోతీలాల్ నాయక్ ఒంటరిగా నిరాహార దీక్షకు దిగారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఒంటరిగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ రవీందర్ చేసిన అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. వీసీ రాజీనామా చేసే వరకు తన నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో వీసీ వైఫల్యాలను వివరించారు. వివిధ కోర్సుల ఫీజులను వంద శాతానికి పైగా పెంచి బడుగు, బలహీనవర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా, విద్యార్థులకు కనీస మౌళిక సదుపాయాల కల్పన పట్ల కూడా నిర్లక్ష్యం ప్రదర్శించారని మండిపడ్డారు. ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. మూడంచెల భద్రతతో, ముళ్లకంచె వేసుకుని కనీసం విద్యార్థులను తన దగ్గరకు రాకుండా బీ సెక్యూర్ సిబ్బందితో అడ్డుకుంటున్నారని తెలిపారు.