- టి.ఎస్.పీ.ఎస్.సి. వెబ్ సైట్ లో అందుబాటులో..
- ఒక ప్రకటనలో తెలియజేసిన అధికారులు..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్టీ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబరు 20న టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల మెరిట్ జాబితాను సబ్జెక్టు వారీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 1540 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్ కీని ఇప్పటికే కమిషన్ విడుదల చేయగా.. తాజాగా సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అర్హులైన అభ్యర్థులను 1 : 2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పిలవనుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో 857 మందిని, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 27,145 మందిని, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో 10,948 మందిని, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 7,726 మందిని మెరిట్ జాబితాలో ఇచ్చింది.