రుద్రప్రయాగ్ : శీతాకాలాన్ని పురస్కరించుకుని కేదార్నాథ్ ఆలయ మహా ద్వారాన్ని భయ్యా దూజ్ సందర్భంగా మూసివేశారు. శీతాకాలమంతా ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. కాగా, తెల్లవారుజామునే చలిలో వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోగా, పూజారులు శివునికి పూజలు, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించిన అనంత రం ఉదయం 8.30 గంటలకు మహాద్వారాలను మూసివేశారు. శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూ సివేసి ఉంచుతామని బద్రినాథ్`కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్నాథుని పంచముఖి డోలిని పూజారులు భుజంపై మోసు కుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయంలో భద్రపరిచారు. ఈ శీతాకాల మంతా స్వామివారికి అక్కడే పూజలు నిర్వహిస్తారు. కాగా, ఈ సీజన్లో కేదార్నాథుడిని 19.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.