- ఉదయాన్నే మాక్ పోలింగ్ ఖచ్చితంగా నిర్వహించాలి
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా(ఆదాబ్ హైదరాబాద్) : పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ విధులను నిర్వహించే అధికారులందరూ సమిష్టిగా పనిచేసే పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లిన వెంటనే తమ పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే నోడల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. పోలింగ్ రోజున సిబ్బంది ఉదయం ఐదు గంటలకు కేంద్రాల్లో ఉండాలని తెలిపారు. ఉదయం 5-30 గంటలకు మాక్ పోలింగ్ కచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. మాక్ అనంతరం సిఆర్సి చేసి, వి ప్యాట్ ల నుండి స్లిప్పులను తొలగించి మాక్ పోలింగ్ సర్టిఫికేటు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఉదయం ఏడు గంటలకు తప్పనిసరిగా పోలింగ్ ను మొదలు పెట్టాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ క్రమంలో రెండు గంటలకు ఒకసారి చొప్పున కచ్చితమైన రిపోర్టును ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఏమైనా సమస్యలు ఉంటే సెక్టోరల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియలు ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన హ్యాండ్ బుక్ ను చదువుకుంటూ పనిచేయాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వివిధ శాఖలు కూడా అప్రమత్తంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ రిటర్నింగ్ అధికారి రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ, స్వీప్ నోడల్ అధికారి మల్లేశం, పంచాయతీరాజ్ ఇఇ ఉమేష్, జెడ్పి డిప్యూటీ సీఈవో సుభాషిని, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ, ఎంపీడీవో సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.