- ప్రభుత్వ వినతిని తోసిపుచ్చిన హైకోర్టు
హైదరాబాద్ : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుతో ఈనెల 27న సింగరేణి ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. సింగరేణి ఎన్నికలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన కారణంగా ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చ్లో నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. గత ప్రభుత్వ హయంలో పలుమార్లు వాయిదా కోరిన వైనాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇక మళ్లీ వాయిదా వేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో అండర్ టేకింగ్ ఇచ్చారు కదా హైకోర్టు ప్రశ్నించింది. సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27 నే నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది.