యాదాద్రి భువనగిరి : అతి వేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్కి ఉదయం 10 గంటలకు బయలుదేరింది. కాగా, జిల్లాలోని అడ్డగుడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అతి వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తా కొట్టింది. దీంతో స్పాట్లోనే అడ్డ గూడూరు మండలం చిన్న పడిశాలకు చెందిన చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్కు చెందిన కొండా రాములు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, కొండా రాములు అడ్డగుడూర్ మండలం కోటమర్తి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గాయపడ్డ వాళ్లను సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి దవాఖానకి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.