Monday, April 29, 2024

కేసీఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు

తప్పక చదవండి
  • మెదక్‌ ఎంపీ సీటు కోసం కవిత కోట్లాట
  • అంతర్గత గొడవల్లో కేసీఆర్‌ కుటుంబం
  • హరీష్‌ ప్రోద్బలంతోనే సీఎంతో ఎమ్మెల్యేల భేటీ
  • బీజేపీ నేత రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

సిద్దిపేట : మెదక్‌ ఎంపీ సీటుకోసం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నా యని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ నుంచి పోటీకి ఎమ్మెల్సీ కవిత పట్టుబడుతోందని అందుకే హరీష్‌ రావు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని చెప్పారు. మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌ రెడ్డి వద్దకు పంపించింది కూడా హరీష్‌ రావేనని అన్నారు. మెదక్‌ జిల్లాలో గెలుస్తామన్న భరోసాతోనే కవిత పట్టుదలతో ఉందని, దీనిని హరీష్‌ రావు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు హరీష్‌ రావుకు తెలియకుండానే సీఎంను కలిశారా అని రఘునందన్‌ ప్రశ్నించారు. వాళ్ళతో బలవంతంగా ప్రెస్‌ మీట్‌ పెట్టించారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలో మొత్తం కాంగ్రెస్‌ లో చేరుతారని.. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ జీరో అవుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు జ్ఞానం రాలేదన్నారు. పార్టీ మీద పెత్తనం కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు జరుపుతున్నారని విమర్శించారు. అంతకుముందు సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తెలంగాణ భవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. నియోజక అభివృద్ధి కోసం సీఎంను, మంత్రులను కలవటం తమ బాధ్యతని తెలిపారు. తాము పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని అందుకే వివరణ ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. లోక్‌ సభ ఎన్నికల్లో భారీ మోజార్టీతో మెదక్‌ ఎంపీ సీటు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్త సంచలనాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖర్మ సిద్దాంతం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అనుభవంలోకి వస్తోందని.. ఎవరు చేసుకున్నది వారికే తిరిగి వస్తుందన డానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడమే నిదర్శనమన్నారు. భూమి గుండ్రంగా ఉంటదని.. మనమేం చేస్తే అదే తిరిగి వస్తుందంటే ఇదే అని చెప్పుకొచ్చారు. మెజారిటీ ఉన్నా కూడా అప్పుడు బీఆర్‌ఎస్‌ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తోందన్నారు. పార్టీలను చీల్చడానికి, ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బీఆర్‌ఎస్‌కు ఏడేండ్లు పడితే… కాంగ్రెస్‌కు ఏడు నెలలు కూడా పట్టడం లేదన్నారు. హరిశ్‌రావు ప్రోద్బలం లేకుండా వీరు వెళ్తారా అని బీజేపీ నేత ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో బావ బామ్మర్ధులకు పడటం లేదన్నారు. కవిత మెదక్‌ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంతో జిల్లా నేతలు, ఎమ్మేల్యేలు అలెర్ట్‌ అవుతున్నారన్నారు. హరీష్‌రావు ప్రోద్భలం లేకుండా వారంతా సీఎంను కలిసే అవకాశం లేదన్నారు. ప్రజలు తిరస్కరించిన తరువాత కూడా బీఆర్‌ఎస్‌ నేతల్లో మార్పు రావడం లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ పెద్ద జీరో అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్‌ అంటే ఏమిటో తమకు నిన్నటి వరకు గుర్తు లేదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కనీసం అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ దుష్ట సంప్రదాయం తెచ్చింది బీఆర్‌ఎస్‌ అని విరుచుకుపడ్డారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది మూసీ, బంగాళాఖాతంలో వేసినట్లే అని అన్నారు. 2009 లో కేసీఆర్‌ అధ్యక్ష పీఠం గుంజుకోవడానికి జరిగిన కొట్లాట మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ అధ్యాయం మొన్నటి ఎన్నికలతో ముగిసిందన్నారు. అధికారం కోల్పోయినా ఇంకా తాము అధికార పార్టీ అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటనడం కేటీఆర్‌ అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే అయితే ఇక ఎన్నికల అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు. బీజేపీకి ఈసారి రాష్ట్రంలో 16 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు 12 సీట్లు అనడం భ్రమ అని.. 90 సీట్లతో అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి సింగిల్‌ డిజిట్‌ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ పార్టీని గల్లీలో కాంగ్రెస్‌ రానియదని.. ఢల్లీిలో బీజేపీ రానియదని రఘునందన్‌ రావు స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు