- మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వానలు
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. కర్మన్ఘాట్, చంపాపేట్, సంతోష్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, పాతబస్తీ, జియాగూడ, మెహదీపట్నం, అమీర్పేట, ఎస్సానగర్, కూకట్పల్లి, బేగంపూట, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి ఈ నెల 26 వరకు వానలు కురుస్తాయని పేర్కొంది. ఈనేపథ్యంలో డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం వల్ల రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ పై అల్పపీడన ప్రభావం..
తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను ప్రభావంతో దక్షిణ భారతంలోని దక్షిణ ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే వాతావరణం కొనసాగితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదనంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు సూచించారు.