- గగన్ యాన్ సాకారం దిశగా తొలి అడుగు..
- క్రూ మాడ్యూల్ సముద్రం మీద ల్యాండింగ్..
- ఇక సొంతంగా వ్యోమొగాములను పంపేందుకు సిద్ధం..
- సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్..
బెంగుళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయం సాధించింది. తొలుత ప్రయోగ ప్రారంభ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో గుర్తించిన శాస్త్రవేత్తలు సరిచేశారు. ఉదయం 10 గంటలకు శ్రీహరికోట నుంచి టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ ద్వారా వ్యోవగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను పరీక్షించింది. దీని ద్వారా రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ సాకారం దిశగా తొలి అడుగు పడినట్లైంది. గగన్యాన్ సక్సెస్ అవ్వడం ఎంతో సంతోషకరమన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. క్రూ ఎస్కేప్ సిస్టమ్ లాంచ్ విజయవంతం అయిందన్నారు. క్రూ మాడ్యూల్ని సముద్రంపై ల్యాండింగ్ చేశామన్నారు. పారాచూట్స్ సరైన సమయంలో తెరుచుకున్నాయని సోమనాథ్ వివరించారు.
గగన్యాన్లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలనే లక్ష్యంతో ఇస్రో ఈ ప్రయోగం చేస్తుంది. పరీక్షించిన మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో జరిగే యాత్రకు కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షిస్తుంది. మొదటగా టీవీ-డీ1 పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. సుమద్రంలో పడే క్రూ మాడ్యూల్ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తుకు సిద్దమైంది.
మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టినప్పుడు రాకెట్లో ఏదైనా లోపం తలెత్తినప్పుడు వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో.. వారు కూర్చొనే క్రూ మాడ్యూల్ను రాకెట్ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకొచ్చేందుకు .. ఇప్పుడు క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ వ్యవస్థ సమర్థతను పరీక్షిస్తున్నారు ఇస్రో సెంటిష్టులు. దీనికోసం క్విక్ రియాక్టింగ్ సాలిడ్ మోటార్లను ఇస్రో అభివృద్ధి చేసింది. 19.5 మీటర్ల పొడవైన ఈరాకెట్ వికాస్ ద్రవ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. క్రూ మాడ్యూల్ను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థలో పది పారాచూట్లను అమర్చారు.