- ప్రజల నుంచి ఛీత్కారం తప్పదనే కామారెడ్డికి మకాం
- కేసీఆర్ను ఓడిస్తేనే తెలంగాణకు ముక్తి
- గజ్వెల్ ప్రచారంలో ఈటెల రాజేందర్ విమర్శలు
సిద్దిపేట : హుజూరాబాద్కు నువ్వు రాకపోతే నీ దగ్గరకే నేనోస్త అని గజ్వేల్కు వచ్చిన.. నేను వచ్చాక నువ్వు కామారెడ్డి పారిపోయావు‘ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో గజ్వెల్ వదిలి కామారెడ్డిలో పోటీకి దిగారని అన్నారు. ఇక్కడి ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేకపోవడంతో ఓడిస్తారన్న భయం పట్టుకుందని, అందుకే కామారెడ్డిలో పోటీకి దిగారని అన్నారు. జిల్లాలోని ములుగు మండలంలోని కొత్తూరుతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రజలు రాకుండా ఉండేందుకు కేసీఆర్ దావత్లు చేస్తున్నారన్నారు. ఈటెల పేదోళ్ల వైపు, ధర్మం వైపు ఉంటాడని… ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అన్యాయానికి వ్యతిరేకంగా పిడికిలి ఎత్తుతాడని స్పష్టం చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే కేసీఆర్ కాదు.. కేసీఆర్ జేజెమ్మతో కొట్లడుతా అని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 30 వేల మంది కేసీఆర్ బాధితులు ఉన్నారన్నారు. కేసీఆర్కు ప్రజల విూద నమ్మకం లేక బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి ప్రజలకు దావతులు, డబ్బులు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నారని ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు.
ఈ ఎన్నికల్లో కెసిఆర్ను ఓడిస్తేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఎకరానికి 24 వేల రూపాయలు సాయం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ చేస్తున్న సాయం పది వేలు మాత్రమేనన్నారు. రైతు పక్షపాతి ఎవరో గుర్తుంచుకుని ఓటు వేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి వేస్తే వరికి కనీస మద్ధతు ధర 3,100 రూపాయలు చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులది భూ కబ్జాల చరిత్ర అన్నారు. ఎన్నికలైపోగానే ఇద్దరూ ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారన్నారు. పేదల పక్షాలన పోరాటం చేస్తే తనపై కుట్ర పూరితంగా కేసులు పెట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్లు ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశారన్నారు. నేను ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే అవన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరానికి ఆరు వేలు బ్యాంకులో జమ చేస్తుందన్నారు. చేనేత బంధు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భూకబ్జాల సంగతి తేల్చుతానన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్కు కుడి భుజంలా ఉంటూ 2004 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ తరపున అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన ఈటల రాజేందర్.. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్పైనే బరిలోకి దిగారు. టీఆర్ఎస్లో తిరుగులేని నేతగా ఎదుగుతూ వచ్చిన ఈటల రాజేందర్ను పొమ్మనలేక పొగపెట్టి పంపించగా.. ఆయన బీజేపీలో చేరి 2022 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించి, విజయం సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా సీఎం కేసీఆర్కు ప్రధాన ప్రత్యర్థిగా మారారు.