- జనవరి 1న ఫ్యూయల్ సెల్ ను నింగిలోకి పంపిన ఇస్రో
- భవిష్యత్ కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్న ఇస్రో
- విద్యుత్, నీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. ఈ నెల 1వ తేదీన పీఎస్ఎల్వీ సీ58తో పాటు నింగిలోకి పంపిన ఫ్యూయల్ సెల్ ను విజయవంతంగా పరీక్షించింది. కొత్త ఏడాది తొలిరోజే విజయవంతంగా నింగిలోకి రాకెట్ను పంపించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. దాన్ని సక్సెస్ఫుల్గా పరీక్షించారు. జనవరి 1 వ తేదీన పీఎస్ఎల్వీ-సీ58తోపాటు నింగిలోకి పంపిన ఫ్యుయల్ సెల్ను విజయవంతంగా పరీక్షించినట్లు తాజాగా ఇస్రో ట్వీట్ చేసింది. అంతరిక్షంలో ఆ ఫ్యూయల్ సెల్ పని తీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించిందని పేర్కొంది. భారత్ భవిష్యత్లో చేపట్టబోయే అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన ప్రయోగాల కోసం ఈ ఫ్యూయల్ సెల్ను అభివృద్ధి చేశారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయల్ సెల్గా ఈ ఫ్యూయల్ సెల్ను వ్యహరిస్తున్నారు. ఇది రసాయన చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేసి.. కేవలం నీటిని మాత్రమే వదులుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేసిందని ఇస్రో పేర్కొంది. పీఎస్ఎల్వీ- సీ58 విజయంతో 2024 ఏడాదిని ఇస్రో ఘనంగా ప్రారంభించింది. ఈ వాహక నౌకతో ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం – ఎక్స్పోశాట్ను కూడా నింగిలోకి పంపించారు. అయితే ఇదే పీఎస్ఎల్వీ – సీ58తోపాటు చివరి దశలో మరో 10 పేలోడ్లను కూడా అంతరిక్షంలోకి మోసుకెళ్లి నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ 10 పేలోడ్లలో ఫ్యుయల్ సెల్ పవర్ సిస్టమ్ కూడా ఉంది.