- అందుకే పేరు మార్పు వ్యవహారం
- కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
లండన్ ఇండియా-భారత్ పేరు మార్పు వివాదంపై మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు రాహుల్ గాంధీ గుప్పించారు. యూరప్ పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విపక్ష ఇండియా కూటమిని చూసి పాలక బీజేపీకి వణుకు మొదలైందని, అందుకే దృష్టి మళ్లించే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇండియా, అది భారత్ అనేది సరైన పదమని, మనం ఎవరనేది ఇది తెలియచెబుతుందని అన్నారు. అయితే ప్రభుత్వంలో భయం పట్టుకుందని, నా దృష్టిలో పేరు మార్పు వ్యవహారం భయం నుంచి వచ్చిన స్పందన అని రాహుల్ పేర్కొన్నారు. బెల్జియంలోని బ్రసెల్స్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్పై తమ పార్టీ అదానీ వ్యవహరం, క్రోనీ క్యాపిటలిజంపై విరుచుకుపడినప్పుడల్లా ఆయన ప్రజల దృష్టిని మరల్చేందుకు సరికొత్త డ్రామాతో ముందుకొస్తారని ఆరోపించారు. విపక్ష కూటమి పేరు ఇండియా ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోందని అన్నారు. ఇండియా కూటమి పేరు ప్రధానిని చికాకు పెడుతున్నదని, అది ఎంతగా అంటే దేశం పేరు మార్చేటంతగా అంటూ ఇది అసంబద్ధమని రాహుల్ మోదీ సర్కార్పై మండిపడ్డారు. దేశాన్ని ఇండియా`భారత్ అని రెండు పేర్లతో పిలవడం అద్భుతమైన ఆలోచన అని రాహుల్ పేర్కొన్నారు. ఇండియా రాష్టాల్ర సమాఖ్య అని రాజ్యాంగం పేర్కొందని, తన సభ్యులతో సంప్రదింపులు జరపడం ద్వారా సమాఖ్యను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. దేశ భవితవ్యాన్ని మార్చేందుకు కాషాయ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారాన్ని కేంద్రీకృతం చేయాలని, సంపద కొద్దిమందికే పరిమితం చేయాలని, భారత ప్రజల మధ్య సంప్రదింపులను నియంత్రించాలన్నది బీజేపీ విజన్ అని దుయ్యబట్టారు. దేశంలో గాంధీ, గాడ్సీ విజన్ల మధ్య పోరాటం జరుగుతున్నదని రాహుల్ అభివర్ణించారు. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్ధలను కాపాడుకుంటూ ప్రజల గొంతుకగా నిలవాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు..