- ఎన్నికల నిర్వహనకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు
ఆస్కారం లేదు : రాచకొండ సీ.పీ. డిఎస్ చౌహాన్
ఎల్బీనగర్ (ఆదాబ్ హైదరాబాద్): నేడు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంతో బాటు ఇబ్రహింపట్నం సివిఆర్ కళాశాలలో రాచకొండ సిపి డిఎస్ చౌహన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భద్రత మీద సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పూటకు కీలకమని ప్రతి ఒక్కరు ఈ హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎలక్షన్ కేంద్రాల చుట్టు ప్రక్కల 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. ప్రజలు అవసరం లేకుండా వీధుల్లో గుమిగూడడం నిషేధించినట్టు తెలిపారు. అవసరమైన చోట చెక్ పోస్టులను ఏర్పాటు చేసామన్నారు. అక్రమ నగదు తరలింపును అడ్డుకోవడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్ వెంట ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.