- రెండో రౌండ్ లే ఆఫ్స్ ప్రకటించిన లింక్డిన్..
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల పరంపర ఇంకా కొనసాగుతోంది. పలు కంపెనీలు విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా, మైక్రోసాఫ్ట్కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డిన్ మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. సుమారు 20 వేల మంది సిబ్బందిని కలిగి ఉన్న లింక్డిన్ తాజాగా రెండో రౌండ్ లేఆఫ్స్ను ప్రకటించింది. దీంతో సంస్థలోని దాదాపు 3 శాతం అంటే 668 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడనుంది. ఇంజినీరింగ్, ఉత్పత్తి, ఫైనాన్స్ విభాగంలోని ఉద్యోగులపై వేటు పడనుంది. ఈ విషయాన్ని లింక్డిన్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ‘ఈ రోజు మేము మా బృందంతో కలిసి చేసిన మార్పుల వల్ల ఇంజినీరింగ్, ఉత్పత్తి, ఫైనాన్స్ విభాగాల్లో దాదాపు 668 మంది తమ ఉద్యోగం కోల్పోనున్నారు’ అని లింక్డిన్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది.