Monday, April 29, 2024

గులాబీకి రెక్కలొచ్చేనా..?

తప్పక చదవండి
  • గులాబీదళంలో అసలు ఏం జరుగుతోంది..?
  • వారసుల విషయంలో ససేమిరా అంటున్న గులాబీ బాస్..!
  • అధికారపార్టీలోని సీనియర్లు కన్నకలలు సాకారమవుతాయా..?
  • విశ్రాంతి తీసుకుంటామంటున్న సీనియర్లను కేసీఆర్ ఏమంటారు..?
  • కారు పార్టీలో తెరచాటు తనయుల రాజకీయం సత్ఫాలితాలనిస్తుందా..?
  • సర్వేలన్నీ సీనియర్లకు అనుకూలంగా వున్నాయంటున్న అధిష్టానం..

( “వాసు” పొలిటికల్ కరస్పాడెంట్.. )
తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన.. వెలుగుతున్న నేతలంతా ఇప్పటికి ఇది చాల్లే అనుకుంటూ హుందాగా రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులకు అవకాశం ఇచ్చి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చూస్తున్నారు. ఇందులో తాము పోటీ చేస్తూ తనయులకు టికెట్ అడుగుతున్నవారు కొందరయితే.. ఇక తమ రాజకీయాలకు పులిస్టాప్ పెట్టి తనయులకు అవకాశం ఇచ్చి, వారి భవిష్యత్తుకు రాజకీయ బాటలు వేయాలను చూస్తున్న వారు మరికొందరు.. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. చాలా మంది ఎమ్మెల్యేలు ఈసారి తమ వారసులను తెరపైకి తెచ్చి.. వారికి భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు.

హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌లో వచ్చే ఎన్నికల నుంచి పోటీ చేసే సిట్టింగులు ఎందరు.. ? ఈ సారి తమ బదులుగా వారసులకు చాన్స్ ఇవ్వాలని చూస్తున్న సీనియర్లు ఎవరెవరు? గెలుపు గుర్రాలుగా ఉన్నవారు తప్పుకుంటామంటే సీఎం కేసీఆర్ సరేనంటారా? ఈ సారికి వద్దు అంటూ ఎప్పటిలాగే మళ్ళీ వాయిదా వేసేస్తారా? ఇంతకీ గులాబీదళంలో ఏం జరుగుతోంది..? వారసులను తీసుకొద్దామనుకుంటున్న సీనియర్లు తమ మనసులో ఏమి అనుకుంటున్నారు ? బీఆర్‌ఎస్ బాస్ ఏమంటున్నారు.. ? కారు పార్టీలో తెరచాటు రాజకీయంఫై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
గులాబీ పార్టీలో వారసుల సందడి :
ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ పార్టీలో సీనియర్ లీడర్ల వారసుల సందడి రోజు రోజుకు పెరుగుతోంది. సిట్టింగ్‌ల్లో చాలా మందికి సీట్లు ఇస్తాం.. వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం.. అంటూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల్లో ఆశలు పెంచుతుండటంతో ఎక్కడా లేని జోష్ కారు పార్టీలో పెరిగింది. అయితే అదే సమయంలో కొందరు సీనియర్లు ఇక చాల్లే అనుకుంటూ రాజకీయాల నుంచి వైదొలగాలని చూస్తున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. ఈ సారి తమ వారసులను తెరపైకి తెచ్చి.. వారిని భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఇందులో కొందరు మంత్రులతోపాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు ప్రతి జిల్లాలోనూ సీనియర్లు విశ్రాంతి తీసుకుని తమ వారసులకు చాన్స్ ఇవ్వాలని కోరుతుండగా, సీఎం కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నారట.. మీరైతేనే గెలుస్తారు.. సర్వేలు కూడా మీకే అనుకూలంగా ఉన్నాయంటూ సీనియర్ల ఆశలపై నీళ్లు జల్లుతున్నారని ప్రచారం జరుగుతుంది.
పోటీకి సీనియర్ ఎమ్మెల్యేల అనాసక్తి :
చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఈ సారి పోటీకి అనాసక్తి చూపుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.. ముఖ్యంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన బదులుగా తన కుమారుడు భాస్కర్‌రెడ్డిని బరిలో దింపాలని చూస్తున్నారు. భాస్కర్‌రెడ్డి ఇప్పటికే డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలుస్తున్న పోచారం ఇక విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటుండగా సీఎం కేసీఆర్ మాత్రం మళ్లీ పోచారంనే పోటీ చేయాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.. అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా తన తనయుడు అమిత్‌ను తెరపైకి తీసుకుని రావాలని చూస్తున్నట్లు సమాచారం. ఒక వేళ గులాబీ బాస్ అనుమతిస్తే వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి సుఖేందర్‌రెడ్డి కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది… సీఎం కేసీఆర్ కు ఆ ప్రతిపాదన నచ్చడం లేదట. అవసరమైతే మునుగోడు నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని సుఖేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ చెప్పారట. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి కుమారుడు జగన్ పోటీ చేయాలని ఉవ్విళ్లురుతున్నారు. ప్రస్తుతం ఆయన జడ్‌పీటీసీగా ఉన్న జగన్ ఆశలపై నీళ్లు జల్లుతూ గోవర్దన్‌రెడ్డినే పోటీ చేయాలని ఆదేశిస్తున్నారు సీఎం.. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఇద్దరు కుమారులు ఈ సారి పోటీకి రెడీ అవుతున్నారట. సీఎం మాత్రం అబ్రహం, అంజయ్యలనే మళ్లీ పోటీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
ఆసక్తికరంగా మెదక్ రాజకీయం :
ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ రాజకీయం చూస్తుంటే అబ్బో అనకతప్పదు.. మెదక్ నుంచి ప్రస్తుతం పద్మా దేవేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఆమె స్థానంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ టిక్కెట్ కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు. ఐతే ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్ ఇచ్చే చాన్స్ ఉందా..? లేదా..? అన్నది ఎన్నికలొస్తేగాని తెలియదు.. ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్ స్వంచంద సంస్థ పేరిట సంక్షేమ కార్యక్రమాల పరంపర ప్రారంభించారు.. నియోజక వర్గ ప్రజలకు తానూ ప్రజాప్రతినిధి కాకముందే ఏమి చేయగలడో చూపించేశారు. దీంతో మెదక్ ప్రజలు
మైనంపల్లి రోహిత్ అభ్యర్థిత్వాన్ని గట్టిగానే బలపరుస్తున్నారు. స్థానిక నేతలతో కలివిడిగా తిరుగుతూ తండ్రికి తగ్గ తనయుడిగా మైనంపల్లి రోహిత్ పేరుతెచ్చుకున్నారు. ఆయన కాకుండా మరెవరికి గులాబీ పార్టీ టికెట్ ఇచ్చిన మెదక్ ప్రజలు సహించలేని స్థితికి పరిస్థితులు చేరిపోయాయి..
కొన్ని స్థానాల్లో కొత్తవాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం :
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై ఇటీవల హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నప్పటికీ నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి గట్టిగానే వీస్తోంది.. అయినప్పటికీ ఆయన పోటీకి అంత సుముఖంగా లేరని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు . తనకు బదులుగా వనమా కుమారుడు రాఘవకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. అయితే ఇక్కడి నుంచి వీరిద్దరిలో ఏ ఒక్కరికీ టిక్కెట్ ఇచ్చే చాన్స్ లేదని బీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వనమా రాఘవపై ఉన్న ఆరోపణలే వారిద్దరికీ ప్రతిబంధకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పొత్తుల్లో ఈ సీటు కమ్యూనిస్టులకు ఇస్తారనే ప్రచారం వినబడుతోంది. ఇదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు కూడా ఈ సారి తనకు బదులు తన కుమారుడు విద్యుత్‌కు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. అయితే ఆయనపై ఉన్న వ్యతిరేకతతో ఆయనకు, అయన కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశం లేదట.. కేసీఆర్ కొత్తోళ్లకు అవకాశం ఇవ్వాలనే చూస్తున్నారట.
వారసులను వద్దంటున్న కేసీఆర్ :
ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈసారి వారసులను పోటీకి పెట్టాలని ప్రతిపాదిస్తుంటే.. వద్దని చెప్పేస్తున్నారు కేసీఆర్. సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే మొగ్గు కనిపిస్తుండటంతో ఈ ఇద్దరి సీనియర్ల ప్రతిపాదనను సీఎం కేసీఆర్ మొహమాటంలేకుండా తిరస్కరిస్తున్నారట. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు బదులుగా ఎంపీ కవిత పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఆమెకు పోటీగా కవిత సోదరుడు కూడా టిక్కెట్ ఆశిస్తుండటంతో రెడ్యానాయక్‌నే మళ్లీ పోటీ చేయమంటున్నారు సీఎం.. కరీంనగర్ జిల్లా కోరుట్లలో సీనియర్ ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సర్వేల్లో ఈ ఇద్దరికీ సానుకూల ఫలితాలు వస్తుండటంతో.. సీఎం నిర్ణయంపై ఉత్కంట నెలకొంది.
కొందరిని పక్కన పెట్టే అవకాశం ఉంది :
పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆయన కోడలికి టిక్కెట్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారట.. అయితే సీఎం కేసీఆర్ పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికే ఈసారి టికెట్ నిరాకరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారు. తనకు బదులుగా ఈ సారి తన కుమారుడు కార్తీక్‌రెడ్డిని మహేశ్వరం నుంచి పోటీకి నిలబెట్టాలని గట్టిగానే పైరవీలు చేస్తున్నారట .. అయితే సబిత ప్రతిపాదనను సీఎం కేసీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్ టిక్కెట్ ఆశిస్తున్నారు. టిక్కెట్ వస్తుందనే ధీమాతో ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టి ముగించేశారు.. కానీ, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికే సర్వేలు అనుకూలంగా ఉండటంతో ప్రశాంత్‌కు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు.
జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లోకి జంప్ చేస్తారా.. ?
పలువురు అపోజిషన్ పార్టీ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను గులాబీ పార్టీలో చేర్చి పోటీకి దింపాలని చూస్తున్నారట .. ముఖ్యమంత్రి మాత్రం ప్రయోగాలకు ఇది సమయం కాదని దాటవేస్తున్నారట.. మరో రెండు నెలల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో.. వచ్చే నెలలో గులాబీ బాస్ ఇచ్చే టిక్కెట్ల విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు