Saturday, April 27, 2024

బీఆర్‌ఎస్‌ ఇక టీఆర్‌ఎస్‌..?

తప్పక చదవండి
  • కొత్త పేరుతో కలిసిరావట్లేదని నమ్మిన కేసీఆర్‌
  • పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యామనే భావన
  • తెలంగాణ సెంటిమెంట్‌ మిస్సయ్యిందనే టాక్‌
  • డ్యామేజీని తగ్గించేందుకు అధినేత ఆలోచన
  • నేమ్‌ చేంజ్‌ తో ప్రజలకు దగ్గరవ్వాలనే స్కెచ్‌
  • కేటీఆర్‌కు సూచించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
  • మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదేనని వ్యాఖ్య
  • పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచన

తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన ఉద్యమపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస).. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెరాస పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మారిపోయింది.. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకుని కీలకమైన భూమికను పోషించే స్థాయికి తెరాస ఎదిగి బలమైన వ్యవస్థను నిర్మాణం చేసుకుంది.. .రాష్ట్రంలో బలమైన పార్టీగా..వ్యవస్థగా రూపాంతరం చెందిన తర్వాత తెరాస చూపు దేశ రాజకీయాలపై పడిరది. తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా తాము బలంగా ఉన్నామని భ్రమించి నేలను విడిచి సాము చేయడానికి తెరాస అగ్రనాయకత్వం ఢిల్లీ వైపు అడుగులు వేశారు. తెరాస .. బీఆర్‌ఎస్‌ గా రూపాంతరం చెందనంతవరకు టీడీపీ,బీఎస్పీ లాంటి ప్రాంతీయ పార్టీలు తెలంగాణ లో పోటీ చేయాలంటేనే తడుముకోవాల్సిన పరిస్థితులు ఉండేవి..తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి వాళ్లే పేటెంట్లుగా చెప్పుకుని తిరిగిన తెరాస అగ్ర నాయకత్వానికి పార్టీ మార్పు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. చివరికి అధికారానికి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..

తెరాస .. బీఆర్‌ఎస్‌గా మారడమే ఓటమికి కారణమా.
కర్ణుడి మరణానికి వెయ్యి కారణాలు అన్నట్లు బీఆర్‌ఎస్‌ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిజానికి తెరాస .. బీఆర్‌ఎస్‌ గామారడానికి వాళ్ళ ఓటమికి ఎలాంటి సంబంధం లేదు.. పార్టీ పెట్టిన సమయంలో కేసిఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ , కవిత తో పాటు పలువురు అగ్రనేతలు కింది స్థాయి నేతలతో ఉద్యమసమాయల్లో కొనసాగించిన మైత్రి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత కొనసాగించలేదు. ఉద్యమసమయంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నాయకులను తెరాస అగ్రనాయకత్వం పట్టించుకున్న పాపానపోలేదు. దీనికితోడు ఇబ్బడి మొబ్బిడిగా పార్టీలోకి చేర్చుకున్న చేరికలు వారికిచ్చిన అగ్ర తాంబూలాలు తెరాస కింది స్థాయి నాయకత్వాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. బాధలు చెప్పుకుందామంటే అధినేతను చేరడం అగ్రనాయకులకే సాధ్యం కానీ పరిస్థితిలు ఏర్పడ్డాయి..తెరాస అగ్రనాయకులకు అనుకోని అదృష్టం కలిసివచ్చింది.. దీనికితోడు చేతిలో అధికారం రాష్ట్రం మాదేనన్న అహంకారం తలకెక్కి చెప్పేవాళ్ళు ఉన్న వినిపించుకునే స్థితిలో లేకపోవడమే తెరాస అలియాస్‌ బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణాలుగా స్వంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

- Advertisement -

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏంలాభం
తెలంగాణ ప్రజలు నీళ్లు , నిధులు, నియామకాల లక్ష్య సాధనే ధ్యేయంగా రాష్ట్రం కోసం పరితపించారు.. తెలంగాణ కోరుకున్నది కావాలని కొట్లాడిరది ఒక్క కేసీఆర్‌, వారి కుటుంభసభ్యులు మాత్రమే కాదు .. తెలంగాణ రాష్ట్రంలో చచ్చి పోవడానికి కాలుచాచిన ముసలివయస్సు నుంచి ఓటు హక్కు రాని బాల్యం వరకు అందరు తెలంగాణ రావడానికి పోరాడారు.. ఎదురు తిరిగారు. ఒక యుద్ధమే చేశారు. ఉద్యమానికి నాయకుడిగా ఉంటానంటే మద్దతు కూడా ఇచ్చారు. తెలంగాణ సాకారం అయినా తరువాత కేసీఆర్‌ కు తెలంగాణ ప్రజలు కృతజ్ఞతగా అధికారం కట్టబెట్టారు..

కానీ కేసీఆర్‌ ఎం చేశారు..
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలర్పించిన బిడ్దల కుటుంబాలను దూరం పెట్టారు.చదువులు మానుకుని రాష్ట్రసాధనే తమ ద్యేయంగా మలుచుకుని పోరాడిన యూనివర్సిటీ విద్యార్థులను కేసీఆర్‌ మూలకు నెట్టేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్‌ కు బలమైన యూనివర్సిటీ విద్యార్థులు,నిరుద్యోగులయిన యువతీ యువకులు,ఉద్యోగస్తులు,ఆర్టీసీ కార్మికులు,కాంట్రాక్టు ఉద్యోగులు,పత్రికా విలేకరులు.. తెరాస అధికారం చేపట్టాక ఎందుకు దూరం అయ్యారని వారే ఆత్మ విమర్శ చేసుకుంటే టక్కున సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే వేల పుస్తకాలు చదివిన పండితులు కదా వారు.

ఆత్మవిమర్శ దిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు
ఒక ప్రాంతీయ పార్టీగా వెలుగు వెలిగిన తెరాస పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీగా మారిన తరువాత అధికారం చేపట్టాక నేలవిడిచి సాము చేసింది. పార్టీని పార్టీ నాయకున్ని నమ్ముకున్న కార్యకర్తలను,నాయకులను, ప్రజలను పక్కన పెట్టింది.అధికారం లో ఉన్నప్పుడు కనీసం మాట్లాడటానికి ఒక్క నిమిషం కేటాయించని నేతలు సమావేశాలంటూ పలకరింపులకు పిలుస్తుంటే దిక్కు తోచని నేతలు బిత్తర చూపులు చూస్తున్నారు.. అవకాశాలన్నీ చేజారాక .. ఓడిపోయాక .. ఇప్పుడు బలాన్ని కూడగట్టి ఎం చేస్తారు. డబ్బుతో, అదృష్టంతో, అధికారంతో తూల దూగినప్పుడు లేని మంచి, చెడు ఇప్పుడెందుకు బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వానికి గుర్తొస్తున్నాయి..

పార్టీ మార్పే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమంటూ కొత్త రాగం
తెలంగాణ రాష్ట్ర సమితిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పార్టీ కాస్త జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ నిర్ణయం తెలంగాణ సెంటిమెంట్‌ ను పార్టీకి దూరం చేసిందని.. ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని మెజార్టీ బీఆర్‌ఎస్‌ శ్రేణులు అభిప్రాయపడుతున్నారని పార్టీలోని ఓ వర్గం కొత్త ప్రచారం మొదలెట్టింది.. . దీంతో బీఆర్‌ఎస్‌ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌ గా మార్చాలన్న డిమాండ్‌ అనూహ్యంగా తెరపీకి తెచ్చింది..

పాతపేరునే ఉంచాలనన్న ప్రతిపాదనను తీసుకొచ్చిన కడియం
వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలోనే బీఆర్‌ఎస్‌ను.. టీఆర్‌ఎస్‌గా మార్చాలన్న అంశంపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ‘తెలంగాణ పార్టీగా ప్రజల్లో మనకు బలమైన గుర్తింపు ఉంది. పార్టీ పేరులో తెలంగాణను తొలగించి, భారత్‌ పేరును చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఆయన తన అభిప్రాయాన్ని పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా చెప్పారు. బీఆర్‌ఎస్‌ తమది కాదనే భావన ప్రజల్లో ఏర్పడిరదని ఆయన చెప్పుకొచ్చారు . కనీసం 1-2 శాతం ప్రజల్లో ఆ భావన ఏర్పడినా, మన పార్టీకి ఆ మేరకు ఓట్లు దూరమయ్యాయనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌?గా మారిన తర్వాత అంతగా కలిసి రాలేదన్న భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉందని కార్యకర్తల మాటగా ఆయన చెప్పే ప్రయ త్నం చేశారు. . నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలు, ప్రజలు ఇదే విషయాన్ని తనతో పాటు తన సహచరులతో ప్రస్తావిస్తున్నారని కడియం పేర్కొన్నారు. .పార్టీకి వరమైన తెలంగాణ సెంటిమెంట్‌?ను దూరం చేసుకోవద్దని.. . తిరిగి టీఆర్‌ఎస్‌?గా మారిస్తే బాగుంటుందని ఈ విషయాన్నీ అధినేత దృష్టికి తీసుకువెళ్లాలని కడియం కేటీఆర్‌ ను కోరినట్లు సమాచారం. . ఇది మెజారిటీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయంగా కడియం స్పష్టం చేసినట్లు చెప్పుకుంటున్నారు.

బీఆర్‌ఎస్‌ ఉన్న తెరాస మళ్ళి తెరపైకి తేవాలి
ఒకవేళ జాతీయస్థాయి రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌? ఉండాలనుకుంటే, దాన్ని అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాలకు టీఆర్‌ఎస్‌?ను తెర మీదకు తీసుకొచ్చే అంశాన్ని ఆలోచించాలని కడియం కేటీఆర్‌ను కోరారట.. ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ వంటివారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుందని ఓ సలహా కూడా ఇచ్చారట.. . అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి కూడా ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారట.ఇంతగా ఉపన్యాసం చేసిన కడియం శ్రీహరి వ్యాఖ్యలపై కేటీఆర్‌, హరీష్‌ రావు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదట . కానీ పలువురు క్యాడర్‌ మాత్రం కడియం చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారట .

పార్టీ మార్చడం సాధ్యమేనా పనేనా ..
ఇప్పుడు మళ్లీ పార్టీ మార్చడం సాధ్యమేనా అన్న అంశంపై కూడా బీ ఆర్‌ ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాంకేతికంగా పేరు మార్చడానికి పెద్ద ఇబ్బందేం ఉండదని.. తీర్మానం చేసి పంపితే.. ఎన్నికల సంఘం ప్రాసెస్‌ ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇలా చేయడం వల్ల నిలకడ లేని రాజకీయ విధానంపై ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుందని అది ఇంకా మైనస్‌ అవుతుందన్న అభిప్రాయంతో కొంత మంది ఉన్నారు.

అసలు కేసీఆర్‌ ప్లాన్‌ ఏంటీ ?
టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ ఇంటి పార్టీ అని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు భావించారు. అందుకే రెండు సార్లు కేసీఆర్‌ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ కేసీఆర్‌ మాత్రం జాతీయ రాజకీయాల పేరుతో ఎన్నికలకు ముందు ఆ సెంటిమెంట్‌ను చేజేతులా కాలరాశారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావం చూపకపోతే ఇక స్టేట్‌ పొలిటికల్‌ సినారియో అంతా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీగా మారుతుందనే చర్చ జరుగుతోంది. దీంతో పార్టీకి సంజీవని లాంటి తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి దక్కించుకోవాలంటే పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ నుంచి టీఆర్‌ఎస్‌గా మార్చాలనే అభిప్రాయానికి అధినేత కేసీఆర్‌ వచ్చారనే టాక్‌ వినిపిస్తోంది.అయితే ఈ విషయం నేరుగా తానే ప్రస్తావిస్తే ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుందని గ్రహించిన కేసీఆర్‌.. వ్యూహాత్మకంగా పార్టీలోని ముఖ్యనేతల ద్వారా లీకులు ఇప్పిస్తూ పార్టీ పేరును తిరిగి మార్చుకునేలా పరిస్థితులు కల్పిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ తన ఆలోచనలను అమలు చేయాలనుకుంటే నేరుగా కాకుండా తొలుత అందుకు తగిన పరిస్థితిని క్రియేట్‌ చేసి ఆ తర్వాత పార్టీ మొత్తం ఆమోదంతోనే ఈ నిర్ణయం జరిగిందనేలా చేయడంలో కేసీఆర్‌ నేర్పరి అని ఈసారి కూడా అదే ఫార్ములాను ప్రయోగిస్తున్నారని పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.

నాట్‌ ఇమ్మిడియేట్లీ బట్‌ డెఫినెట్లీ
నేషనల్‌ పాలిటిక్స్‌లో చక్రం తిప్పాలనే వ్యూహంతో బీఆర్‌ఎస్‌ పేరుతో కేసీఆర్‌ వేసిన తొలి అడుగు బెడిసికొట్టింది. సొంత గడ్డపైనే ఎదురుదెబ్బ తగలడంతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ పాగా వేయాలనే ఆలోచనకు అనేక సందేహాలు సంశయాలు మొదలయ్యాయి. దీంతో రచ్చ గెలవాలంటే మొదట ఇంట గెలవాలన్న సూత్రాన్ని పాటించాల్సిందేనని ఇది జరగాలంటే ప్రజలకు దూరమైన తెలంగాణ పదాన్ని తిరిగి పార్టీ పేరులో ఉండాల్సిందే అనే ఆలోచనకు కేసీఆర్‌ వచ్చారని ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకపోయినా రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ పని చేస్తారనే వాదనలు వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ గా మార్చి అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్‌ తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చితే ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి మరి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు