Wednesday, May 8, 2024

నాకు కేవలం రూ.9 జీతం చాలు

తప్పక చదవండి
  • ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉదారతకు జనాలు ఫిదా ..
  • ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా బీర్ల కు ప్రతినెలా రూ.4లక్షల వేతనం ..
  • రూ.9 మాత్రమే తీసుకుని, మిగతా మొత్తం పేదల కోసం వెచ్చిస్తా..
  • ఐలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల ఆలేరు ప్రజలు హర్షం వ్యక్తం

హైదరాబాద్ : యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యేగా బీర్ల ఐలయ్య తొలిసారిగా ఎన్నికయ్యారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే బీర్ల ఐలయ్య పేదల కష్టాల్లో నిత్యం పాలు పంచుకుంటున్నాడు.ప్రస్తుతం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా బీర్ల ఐలయ్యకు ప్రతినెలా రూ.4లక్షల వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది. తనకు వచ్చే వేతనంలో రూ.9 మాత్రమే తాను తీసుకుంటానని, మిగతా మొత్తం పేదల సంక్షేమానికే వెచ్చిస్తానని ఐలయ్య ప్రకటించారు. తొమ్మిది తన అదృష్ట సంఖ్య (లక్కీ నంబరు) అని, అందుకే జీతంలో ప్రత్యేకించి తొమ్మిది రూపాయలే తీసుకుంటున్నానని ఐలయ్య చెప్పారు.

తన సొంత ఆదాయంలో పేదలకు ఆర్థిక సహాయం చేస్తుంటానని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా, విప్‎గా తనకు ప్రభుత్వం అందించే వేతనాన్ని ప్రతినెలా పేదలకు ఆర్థిక సాయం రూపంలో అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు పరీక్షా సమయం కావడంతో రూ.7.50 లక్షలు వెచ్చించి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశానని ఎమ్మెల్యే తెలిపారు. ఆలేరు నియోజక వర్గంలోని అనాథలు, దివ్యాంగులు, ఆటో కార్మికులు, వృద్ధులను ఎంపిక చేసి సాయం అందజేస్తానని చెప్పారు. ఈ సహాయ సహకారాలు తాను పదవిలో ఉన్నన్ని రోజులు కొనసాగిస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఐలయ్య ఉదారత, వేతనంపై తీసుకున్న నిర్ణయం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు