- రాష్ట్రంలో పక్కాగా కులగణన
- రాజస్థాన్ ప్రజలపై కాంగ్రెస్ హామీల వర్షం
రాజస్థాన్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక హామీలు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తామని తెలిపింది. రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, అందులో ప్రభుత్వ రంగంలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడిరచింది. జయపురలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రకటించగా.. తాజాగా కులగణనను అందులో చేర్చింది. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థ.. 15 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు. 2030 కల్లా జీడీపీని 30 లక్షల కోట్ల రూపాయలకు చేరుస్తామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను తాము నిర్వహిస్తున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు గర్విస్తున్నారన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 46.48 శాతం పెరిగిందని వెల్లడిరచారు. 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్లో నవంబరు 25వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23 వరకు ప్రచారానికి గడువు ఉంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తమ మేనిఫెస్టోను ప్రకటించింది.