- ట్రాక్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లు..!
- మధ్యవర్తులుగా బాలకృష్ణ,సాయిరెడ్డి..!
- కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్.. చేయిస్తానని పైసల్ వసూల్
- రూ.15 లక్షలకు ఒప్పందం..!
- ఫస్ట్ ఫేజ్ ఇన్స్టాల్మెంట్గా రూ.5 లక్షలు
- పైసల్ ముట్టినా ఉద్యోగాలు పర్మినెంట్ కాని వైనం
తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటట్ (ట్రాక్) ఏడీజీ గంటా శ్రీనివాస్ రెడ్డి అవినీతి లీలలు తవ్వినకొద్ది వెలుగు చూస్తున్నాయి. కేంద్ర సర్వీసులకు సంబంధించిన ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి పనులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ట్రాక్ ప్రాజెక్టులకు సంబంధించిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసిన గంటా.. కాంట్రాక్ట్ ఉద్యోగులనూ పర్మినెంట్ చేస్తానని చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు దండుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్రాక్ లో సుమారు 52 మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా రాష్ట్ర విభజన జరగక ముందు నుంచే ట్రాక్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాక్ లో మొత్తం ఉద్యోగుల్లో కేవలం ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉండగా..మిగతా ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే కావడం గమనార్హం. ట్రాక్ ప్రస్తుతం విజయవంతంగా నడవడానికి మెయిన్ రీజన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కృషేనని చెప్పాలి. ట్రాక్ లోని అత్యంత కీలకమైన వర్క్స్ అన్నింటిని వీరే నిర్వర్తిస్తుంటారు. ఎర్త్ సర్ ఫేస్ అప్ డేషన్స్, శాటిలైట్ డేటా ఆధారంగా పంటల సమాచారం,మైనింగ్ కార్యకలాపాలు,రోడ్ నెట్ వర్క్స్ డిటైల్స్ వంటి పనులను వీరే చేస్తుంటారు. వీరు ఒక విధంగా ట్రాక్ కు గుండెకాయ వలె పనిచేస్తున్నారు.
పర్మినెంట్ పేరుతో పైసల్ వసూల్..!
ట్రాక్ లో ఇంతటి కీలకమైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆ సంస్థ ఏడీజీ,అవినీతి తిమింగలం నిలువు దోపీడి చేసేశారు. ట్రాక్ లో సుమారు 52 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తుండగా..వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు దండుకోవడం విస్మయం కల్గిస్తోంది. ఇందుకోసం గంటా ట్రాక్ లోని ఇద్దరు ఉద్యోగులు బాలకృష్ణ, సాయిరెడ్డిలను మధ్యవర్తులుగా పెట్టుకొని యవ్వారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత బీఆర్ఎస్ సర్కార్ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పలు శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను పర్మినెంట్ కూడా చేసేసింది.
ఈనేపథ్యంలోనే ట్రాక్ ఏడీజీ గంటా శ్రీనివాస్ రెడ్డి కొత్త నాటకానికి తెర తీశారు. ఇతర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ పర్మినెంట్ అయినట్లే ట్రాక్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరిస్తానని ప్రచారం చేసుకున్నారు. అయితే ఇందుకోసం ప్రభుత్వంలోని పెద్దలు,డిపార్ట్ మెంట్ లోని ఉన్నతాధికారులను చల్లబర్చాల్సి ఉంటుందని తన తాబేదార్ల ద్వారా చెప్పించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయిస్తానని చెప్పి మధ్యవర్తుల ద్వారా రూ.15 లక్షల ప్యాకేజీగా ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా తన తాబేదార్లైన బాలకృష్ణ, సాయిరెడ్డి లను రంగంలోకి దింపి ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా రూ.5 లక్షలు వసూల్ చేయించడం విశేషం. ఆ తర్వాత రెండో విడతగా మరికొంత మంది ఉద్యోగుల నుంచి సెకండ్ ఫేజ్ లో మరో రూ.5 లక్షలు పుచ్చుకున్నారు. ఇలా ఫస్ట్ పేజ్ లో దాదాపు 35 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి ఆమ్యామ్యాలు బొక్కేయగా..రెండో విడతలో మరికొంత మంది ఒప్పంద ఉద్యోగుల నుంచి పైసల్ దిగమింగి అప్పనంగా సోమ్ము చేసుకోవడం విస్మయం కల్గిస్తోంది.
డబ్బులు ముట్టజెప్పినా.. ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపని వైనం
మరోవైపు ట్రాక్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందరూ దాదాపు ఏడీజీ గంటా శ్రీనివాస్ రెడ్డికి పైసల్ ముట్టజెప్పినప్పటికీ.. ఆయన మాత్రం వారిని పర్మినెంట్ చేయమని అప్పటి రాష్ట్ర సర్కార్ కు ప్రపోజల్ ఫైల్ పెట్టకపోవడం గమనార్హం.
కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ అయితే ఎక్కడ తన అవినీతి కార్యాలకు అడ్డుపడుతారోనని వారి దగ్గరి నుంచి పైసల్ దండుకున్నప్పటికీ.. ప్రభుత్వానికి మాత్రం పర్మినెంట్ ప్రపోజల్ ఫైల్ పెట్టకుండా వారిని నిలువునా..ముంచడం విశేషం. మొత్తానికి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పిన గంటా..వారిని నిలువు దోపిడి చేసి వారి పరిస్థితిని చిక్ఱేసిన మామిడి టెంక మాదిరి తయారు చేసి వదిలేయడం గమనార్హం.