హైదరాబాద్ : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు హైదరాబాద్ జట్టు ఫోబియా పట్టుకుంది. ఏ సీజన్ లో అయినా ఆర్సీబీ ఆశలపై హైదరాబాద్ జట్టే నీళ్లు చల్లుతోంది. ఇప్పటి వరకు 16 సీజన్లు ఆడిన ఆర్సీబీ కీలక మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో బెంగుళూరు జట్టు కీలకమైన మ్యాచ్ కు సిద్దమైంది. ఈ మ్యాచులో గెలిస్తేనే ఆర్సీబీకి ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే బెంగుళూరు ఆశలు గోవింద..గోవిందా అన్నట్లే.
16 సీజన్లు ఆడినా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. 2009లో ఐపీఎల్ ఫైనల్ చేరినా…అప్పటి హైదరాబాద్ టీమ్..డెక్కన్ ఛార్జెర్స్ చేతిలో ఓటమితో తృటిలో కప్పు కోల్పోయింది. ఆ తర్వాత 2016లో ఫైనల్ చేరినా మరోసారి హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. 2012లో డేయిల్ స్టెయిన్ అదిరిపోయే పర్ఫామెన్స్తో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ను కోల్పోయింది. ఇక 2013లో కోల్ కతాను ఓడించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీని వెనక్కినెట్టి ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. దీంతో ఆర్సీబీ టీమ్ 5వ స్థానంతో ఇంటిదారి పట్టింది. 2020 లోనూ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీని సన్ రైజర్స్ హైదరాబాదే ఓడించింది. 2021లోనూ సన్రైజర్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ క్వాలిఫయర్-1కు అర్హత సాధించలేకపోయింది.
ఈ క్రమంలోనే మే 18వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ ఆర్సీబీకి డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచులో సన్ రైజర్స్ గెలిస్తే ప్రయోజనం ఉండదు. కానీ ఆర్సీబీ గెలిస్తే మాత్రం ఆ జట్టుకు ఉపయోగంగా ఉంటుంది. అయితే హైదరాబాద్ జట్టుతో ఆర్సీబీకి మెరుగైన రికార్డులేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. డూఆర్డై మ్యాచ్ల్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రతీసారి ఆర్సీబీకి షాకిస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో మరోసారి సన్రైజర్స్ ఆధిపత్యమే కొనసాగుతుందా.. లేక ఆర్సీబీ ఈ సారి చరిత్రను తిరగరాస్తుందా.. అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సన్రైజర్స్ హైదరాబాదతో జరిగే మ్యాచ్ ఫలితంపైనే ఆర్సీబీకి ఈ సీజన్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఆర్సీబీ తన చివరి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. మే 18వ తేదీన ఆర్సీబీ సన్రైజర్స్తో పోటీ పడనుంది. ఆ తర్వాత మే 21వ తేదీన గుజరాత్ టైటాన్స్తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఆర్సీబీ గెలిస్తే మిగతా జట్ల ఫలితంతో సంబంధం లేకుండా ప్లేఆఫ్కు చేరుతుంది. అయితే ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్లో గనుక ఆర్సీబీ ఓడితే…మ్యాక్సిమమ్ ఆర్సీబీ ఇంటికి చేరినట్లే. దీంతో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరతాయి. కానీ చివరి మ్యాచులో గుజరాత్ పై గెలిస్తే ఆర్సీబీ భవితవ్యం మాత్రం ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.