ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేయాలి
- రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో సభలు
- సమయానుకూలంగా గ్రామసభలను నిర్వహించాలి
- అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు..
- ప్రజల కోసం పని చేసే అధికారులను ఎప్పటికి గౌరవిస్తాం
- స్వేచ్ఛ హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు
- నేతలకు ఐదేళ్లే… అధికారులకు 35 ఏళ్ల సర్వీసు
- సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించి కలెక్టర్లకు , ఎస్పీలకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు కావాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా సమన్వయంతో కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతను ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్లు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన పేరుతో గ్రామసభలను నిర్వహించాలని, పథకాల లబ్ధిదారుల ఎంపిక నిస్పక్షపాతంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వానిది,అధికారులదేనని గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామని వివరించారు.అభివృద్ది చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని.. చెప్పుకొచ్చిన సీఎం పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది అని స్పష్టం చేశారు. అద్దాల మేడలు కట్టో.. రంగుల గోడలు చూపించో.. అభివృద్ది జరిగిందని ఎవరైనా భ్రమపడితే… తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని.. నిజమైన అభివృద్ది అనేది పౌరులయొక్క సమగ్రాభివృద్ది జరిగినప్పుడే.. సాధ్యమవుతుందని సీఎం అన్నారు. చివరి వరుసలో వున్న పేదవారికి కూడా సంక్షేమ పథకం ఫలాలు అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ది చెందినట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని సీఎం అన్నారు .. అందుకే ఈరోజు చివరి వరుసలో నిలబడ్డ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వుండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలి. చేరాలంటే చేరవేయవలసిన వారధి మీరే.. మీమీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయ హస్తం ద్వారా అమలు చేయబోయో ఆరు గ్యారంటీలను దానికి సంబంధించి వినతిపత్రాలను, అప్లికేషన్లను తీసుకోవాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని సీఎం అధికారులతో అన్నారు.
ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ప్రెండ్లీగవర్నమెంట్ అంటే అధికారులు మీరు ప్రజలచేత శభాష్ అనిపించుకున్నంతవరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా వుంటుంది.మీ పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా.. లేదా ఉద్దేశపూర్వకంగా అధికారులు తమ ఇష్టానుసారంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా వాటన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుందని సీఎం అన్నారు. అదే విధంగా మనం చాలా సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మనను ఆకర్షిస్తాయి. కొంతకాలం పనిచేసిన అధికారులు వారు బదిలీ అయినప్పుడు వివిధరాష్ట్రాల నుంచి వచ్చిన అఖిల భారత సర్వీసులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కొరుకుని వచ్చిండ్రు. కనీసం 35 సంవత్సరాల సర్వీసు చేయగలరు. ఈ రాష్ట్రంలో పౌరుల్లో భాగంగా మీరు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చిండ్రు. మాది ఏదో రాష్ట్రమనో, భాష వేరే అని మీరెవరు భావించవలసిన అవసరం లేదు. మేము ఎవరమూ కూడా మిమ్మల్ని ఆ రకంగా నియంత్రించే విధంగా చూడడం లేదు. భాషను తెలుసుకోండి.. ప్రజల మనసులను గెలుచుకోండి. ప్రజల మనసులు మీరు గెలిచి విశ్వాసంతో నమ్మకంతో జవాబుదారితనంతో పనిచేయండని సీఎం అన్నారు.
తెలంగాణ రాష్ట్రం గతంలో ఉద్యమ నేపథ్యం వున్న రాష్ట్రం..
గతంలో ఇక్కడ రకరకాల భావజాలంతోని, పౌర హక్కుల కోసం ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ సంఘాలు ప్రభుత్వాలు నిషేధించిన సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తరపున పోరాటాలు చేసిండ్రు.. ప్రభుత్వం చట్టాలు అమలు చేసిటప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని వుండొచ్చు.. పోలీసు అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేటప్పుడు కఠినంగా వ్యవహరించి వుండొచ్చు. అప్పుడప్పుడు నేను టీవిల్లో, పేపర్లలో చూస్తున్నాను.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని… ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోటి.. పౌరునితో వుండాలి.. క్రిమినల్స్తో కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రెండ్లీ అప్రోచ్ అనేది క్రిమినల్స్ తో కాదు.. గంజాయి, హెరాయిన్, కొకైన్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా వుండమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థం. నేరాలు, హత్యలు చేసిన వాళ్లు పోలీస్ స్టేషన్ కు వస్తే.. వాళ్లను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేయమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. సామాన్యమైన పౌరుడు పోలీస్ స్టేషన్ కు వస్తే ఫిర్యాదు చేయడానికి వస్తే అతను ఏమి చెప్తున్నాడో.. వాళ్లను కూర్చోబెట్టి మర్యాదగా వాళ్లను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మిస్ యూస్ చేసినా అబ్యూస్ చేసినా.. ప్రభుత్వం ఉపేక్షించదు.. అందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి.. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫీయా.. ఉద్యమ నేపథం వున్న తెలంగాణ రాష్టంలో ఈరోజు చిన్నచిన్న పట్టణాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది..జూనియర్ కాలేజీల్లో, స్కూళ్లలో కూడా ఈరోజు మత్తు పదార్ధాలు అందుబాటులోకి వచ్చినయ్.. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.. ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం క్షమించదు. మీరు గతంలో తీవ్రవాదులను, ఐఎస్ఐ లాంటి వాళ్లను కూడా కూకటి వేళ్లతో పెకిలించడానికి, నిర్మూలించడానికి ఏ రకంగా అయితే కఠినమైన చర్యలు తీసుకున్నారో.. వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారో.. ఈరోజు ఈ డ్రగ్ మహమ్మారినికి కూడా నిర్మూలించేందుకు కృషిచేయాలి. అడీషినల్ స్థాయి అధికారులను నియమించాం.. కింది స్థాయి వ్యవస్థలను కూడా బలోపేతం చేసే అధికారులను నియమిస్తాం. గ్రేహండ్స్ , ఎసిబి, సైబర్ క్రైమ్ వంటివి ఏ పర్పస్ కు స్టార్ట్ చేసిండ్రో… విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ పర్పస్ కు స్టార్ట్ చేసిండ్రో.. ఆయా సందర్భాలలో, ప్రమాణాల ప్రకారం అప్పటి ప్రభుత్వం యొక్క అవసరాలను బట్టీ ఆ సంస్థలను పోలీస్ విభాగంలో అడిషినల్ పవర్స్ వారికిచ్చుకుంటూ ఎదైతే ఏర్పాటు చేసిండ్రో.. ఈరోజు ఒక గ్రేహండ్స్, ఎసిబి, సైబర్ క్రెం వీటిన్నింటిని కలిపితే.. ఇక్వల్ టూ టిఎస్ న్యాక్.. ఆంటే నార్కోటిక్ బ్యూరో అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం వున్నది.. మన కళ్లముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం కనిపిస్తున్నది. తెలంగాణ పంజాబ్ రాష్ట్రం వంటి పరిణామాల వైపు వేగంగా ప్రయణిస్తున్నది.
మత్తును నిషేదించి నిర్మూలించాల్సిన బాధ్యత మన పోలీస్ అధికారులది.
నాకు కొంత అవగాహన వున్నది.. నేను ప్రజల్లో తీరుగుతూ వున్నాను. ఎక్కడ ఎమి జరుగుతుందో పోలీస్ అధికారుల వద్ద సమాచారం వుందో లేదో కానీ, స్వయంగా నా దగ్గర కొంత సమాచారం వుంది. పోలీస్ శాఖకు, అధికారులకు నేను ఇక్కడి నుంచి ఇచ్చే ఆదేశాలు ఇస్తున్నాను. మీరు ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం వుంది. గంజాయి అనే పదం ఈరాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమనేపథ్యం వున్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడొచ్చి ఇక్కడి యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. సైబరాబాద్ కమిషనర్ ను ఆదేశిస్తున్నా.. సన్ బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో కొన్ని టికెట్లు అమ్ముతున్నట్లు వున్నారు. బుక్ మై షో లాంటి కొన్నింటిని నేను స్వయంగా గమనించినా.. వాళ్లు ప్రభుత్వ అనుమతి పొందలేదు.. అనుమతి పొందకుండా 31 రాత్రి సన్ బర్న్ పార్టీకి సంబంధించి టికెట్టు విక్రయిస్తున్నారు. 18 సంవత్సరాలలోపు వారికి అనుమతి లేదు..అండర్ 18 వారికి మద్యం అమ్మడానికి లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా అన్నీ దొరుకుతున్నాయి. బుక్ మై షో ఫ్లాట్ ఫాం ఎదైతో వుందో దానిమీద ఎంక్వైరీ చేయండి.. అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడానికి వీలు లేదు. పోలీసుల అనుమతి లేకుండా టికెట్లు అమ్మడానికి లేదు. వారు ఎలా అమ్ముతున్నారు. ఇట్లాంటి విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే.. గతంలో నేరగాళ్లకు ఒక విధానం వుండేది. ఇప్పుడు సైబర్ క్రైమ్ బిగ్గెస్ట్ టాస్క్.. సంప్రదాయమైన నేరాలంటారు గదా ఆ నేరాలిప్పుడు పూర్తిగా సైబర్ క్రైమ్ లొకి వెళ్లిపోయినయ్. ఇప్పటి నేరాల నేచర్ మారిపోయింది. సైబర్ క్రైమ్ నేరగాళ్లు పెరిగిపోయారు. పోలీస్ వాళ్లు ఇంకా పటిష్టతను పెంచుకోవాలి.. దీని మీద కూడా పోలీస్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఈవెంట్స్ను జల్లెడ పట్టండి..వాటిని ఆదాయ వనరుగా చూడకండి. అవి ఎలాంటి కల్చర్ పెంపొందిస్తున్నాయంటె.. యువతను పెడద్రోవకు మళ్లిస్తున్నాయి. హుక్కా సెంటర్స్, పబ్స్ లో జరిగే వ్యవహారాలు గాని, ఇట్లాంటి సన్ బార్న్ పార్టిలను గోవా, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలు నిషేధించాయి. ప్రస్తుతం మాత్రం చాలా కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్లయినా, వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏమున్నా ఎవ్వరినీ ఉపేక్షించకండి. ఎవ్వరూ మాట్లాడినా.. ఎవ్వరినీ వదలాల్సని పని లేదు. ఈ విషయంలో సంపూర్ణంగా పోలిస్ అధికారులకు అధికారాలు ఇస్తున్నాను. గంజాయి ఎవోబి ప్రాంతం నుండి సప్లయ్ అవుతుందా? ఎమవుతుంది.. మన దగ్గర పండిరచేది చాలా తక్కువగా వుండొచ్చు.. కానీ వినియోగించేది ఎక్కువైంది. ఎవోబి ప్రాంతం నుండి మన ప్రాంతానికి ఏరకంగా వస్తుంది? ఎలా జరుగుతుందన్నది పోలీస్ అధికారులు క్షుణ్ణంగా చూడండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒక్కటే కాదు మీరు చేసే పని.. ప్రతి జిల్లా ఎస్పీ పట్టాణాలు, మండలాల్లో గంజాయి సరఫరా జరుగుతుందో తెలుసుకోండి.. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించండి. సమాచారాన్ని సేకరించండి. ఎవరున్నా కూడా ఎవ్వరినీ వదలడానికి వీలులేదు.
నకిలీ విత్తనాలు. ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది.
కష్టపడే రైతు నకిలీ విత్తనాల ద్వారా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నకిలీ విత్తనాలే కారణం. నకిలీ విత్తనాల వెనుక ఉన్న కార్పొరేట్ కంపెనీలు సేల్స్ కోసం ఏవరో ఏజంట్ ను అపాయింట్ చేస్తడు. ఏజంట్ విత్తనాలు అమ్ముతాడు. అధికారులు కంపెనీ మీద కేసు పెట్టకుండా లాస్ట్ పాయింట్ మీద కేసు పెట్టగానే మరుసటి రోజు విత్తనాల కంపెనీ పేరు మార్చుతాడు. అంతకుముందు అన్న పేరు మీద లైసెన్సు ఉంటే తమ్ముడి పేరు మీద నడిపిస్తడు. అధికారులు నోటీసులు ఇవ్వగానే బోర్డు తిప్పేసి నకిలీ విత్తనాల దందా నడుస్తున్నది.రౌడీషిటర్ల మాదిరిగా నకిలీ విత్తనాలు అమ్మే వారి మీద పోలీసులు… స్టేట్ అంత ఒక యునిట్ కింద క్రిమినల్స్ కోసం ఎలాగైతే డేటా బేస్ తయారుచేసుకుంటారో అలాగే నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదంతో అణచి వేయాల్సిన అవసరం ఉన్నది.
కంపెనీ ఓనర్లను బాధ్యులను చేసినప్పుడే నకిలీ విత్తనాల నియంత్రించబడుతాయి. పెద్ద కంపెనీలు ఎప్పుడూ కింద ఉన్న ఎవరిదో చూపెడుతారు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వడానికి నకిలీ విత్తనాల కంపెనీల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్టు కింద వారి ఆస్తులను జప్తు చేయాలి. పోలీసులు డ్రగ్ మాఫీయా తో సంబంధమున్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నారు . ఈడీ కేసులు ఉన్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నది. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదు. జవాబుదారితనం వారికి ఎందుకు లేదు. చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాలని అధికారులకు నేను ఆదేశిస్తున్నా. నకిలీ విత్తనాలను క్షమించే సమస్యనే లేదు. రైతులు చనిపోవడానికి ప్రధానమైన కారణం నకిలీ విత్తనాలు. ఈ విత్తనాలతో పంటలు పండిస్తే రైతు అప్పులపాలై చచ్చిపోతున్నారు. వీటన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పరిపాలనలో మీరు అధికారులుగా తీసుకోవాల్సిన నిర్ణయాలు.
మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలు పెంచేలా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన విషయాల్లో కూడా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ఇలా చేసేవారి సమాచారం సేకరించి వారందరిని ఒక లైన్ లోకి పట్టుకురావాల్సిన అవసరముంది. ఏ విధంగా వారిని కంట్రోల్ చేయాలనేది ఆలోచించాలి.రెవెన్యూ డిపార్ట్ మెంట్ గ్రామ సభలను నిర్వహిస్తుంది. పోలీసు డిపార్ట్ మెంట్ వీటిని స్ట్రీంలైన్ చేయాలి. ప్రతి రోజు రెండు సభలు రెండు గ్రామాల్లో చేయాలి. మండలంలో రెండు టీంలు ఉంటే ఒక టీంకు ఎమ్మార్వో, మరో టీఎంకు ఎంపీడీవో బాధ్యత తీసుకుంటారు.ప్రజా పాలన కోసం శాసన సభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను డిప్యూట్ చేస్తాం 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తాం. వారు నియోజకవర్గంలో వచ్చి కూర్చుంటరు. ప్రతి మండలాన్ని వర్టికల్ కింద డివైడ్ చేస్తారు.ఒక వర్టికల్ కు ఎమ్మార్వో, మరో వర్టికల్ కు ఎంపీడీవో గారు బాధ్యత వహిస్తరు. వారి క్రింద ఆఫీసర్స్ స్ట్రక్షర్ ఉంటుంది.ప్రతి అధికారి రెండు గ్రామాలకు వెళ్లాలి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు మరొక గ్రామం. అప్లికేషన్లు తీసుకోవడం వంటి పనులుచేయాలి. పోలీసు డిపార్టుమెంట్ తో పాటు స్పెషల్ ఆఫీసర్ స్థానికంగా సమన్వయం చేసుకోవాలి. గ్రామాలకు సంబంధించి ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలి. మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలి. ప్రత్యేక కౌంటర్లు మహిళలకు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోండి.