- తేల్చేసిన అటవీ శాఖ అధికారులు..
- కొత్తూరులో చిరుత కలకలంపై వీడిన మిస్టరీ..
కొత్తూరు (ఆదాబ్ హైదరాబాద్): కొత్తూరులో చిరుత కలకలంపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. షాద్ నగర్ అటవీ సెక్షన్ ఆఫీసర్ రవీందర్, బీట్ ఆఫీసర్ అజీజ్ మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన పాదముద్రలు, దూడలను చంపిన తీరును బట్టి అది చిరుత కాదని హైనాగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. చిరుత దాడికి హైనా దాడికి తేడా ఉంటుందని పేర్కొన్నారు.
చనిపోయిన లేగ దూడలు పొట్ట భాగంలో ఒక వైపు మాత్రమే చీల్చినట్లుగా ఉందని అన్నారు. చిరుత మెడ లేదా రెండు కాళ్ల మధ్యలో దాడి చేసి తింటుందని వివరించారు. చిరుత దాడి చేసినట్లయితే వాటి గోర్లు లేగ దూడకు ఇరువైపులా ఉండాలని కానీ ఒకే వైపు చీల్చినట్లుగా ఉందని చెప్పారు. జంతువు ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సమీప పొలాల రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.