బ్యాంకాక్ : పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజుల పాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. నవంబరు 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ సడలింపు ఇవ్వనుంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయ్లాండ్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని శ్రేట్టా థవిసిన్ తెలిపారు. గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయ్లాండ్ వీసా మినహాయింపును ఇచ్చింది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయ్లాండ్కు వెళ్తుంటారు. కొద్దిరోజుల క్రితం శ్రీలంక భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది.