ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తంగా వ్యవహరించిన పైలెట్ వెంటనే లోపాన్ని గుర్తించి హెలిక్యాప్టర్ను తిరిగి ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు క్షేమంగా మళ్లించాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలిక్యాప్టర్లో దేవరకద్రకు బయలుదేరిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలెట్ అప్రమత్తమైన పెను ముప్పును తప్పించారు. వెంటనే మార్గ మధ్యలో దించేశారు. సీఎం దేవరకద్ర వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తిందని తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ నేతలు కూడా అప్రమత్తమైన ఘటనపై ఆరా తీస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో్ జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ఇవాళ సీఎం కేసీఆర్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హెలిక్యాప్టర్లో సాంకేతిక లోపంతో ఆయన పర్యటన ఆలస్యమైంది. అయితే సీఎం తన పర్యటనను రద్దు చేసుకోలేదని, మరో హెలిక్యాప్టర్ రాగానే యథావిధిగా కొనసాగిస్తారని అధికారులు తెలిపారు.