ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023 ఫీవర్ మొదలైంది. ఎక్కడ చూసినా ప్రపంచకప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఈ మెగా ఈవెంట్ భారత్ లో జరుగుతుం డటంతో మన అభిమానులకు మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. 2011లో వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత్.. మళ్లీ ఆ ఘనతను రిపీట్ చేయలేకపోయింది. 2015, 2019లలో జరిగిన వన్డే ప్రపంచకప్ లలో సెమీస్ అడ్డంకిని దాటలేకపోయింది. ఇక ఈ ప్రపంచకప్ లో సెమీఫైనల్ చేరే జట్లు ఏవో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చెప్పేశాడు. ఐసీసీ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ నాకౌట్ దశకు చేరుకునే నాలుగు జట్లను చెప్పేశాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా సెమీఫైనల్కు తప్పకుండా చేరుతుందని సచిన్ టెండూల్కర్ విశ్వాసం వక్తం చేశాడు. భారత్ తో పాటు ఆస్ట్రేలియా కూడా నాకౌట్స్ కు చేరుకుంటుదన్నాడు. ఇక మిగిలిన రెండు జట్లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు ఉంటాయన్నాడు. ఈ లెక్కన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు సెమీస్ చేరతాయని సచిన్ అంచనా వేశాడు. సచిన్ ప్రిడిక్షన్ నిజం అయితే పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. క్రికెట్ పండితులు కూడా సచిన్ చెప్పినట్లుగానే భారత్, ఆసీస్, ఇంగ్లండ్, కివీస్ లనే సెమీస్ ఫేవరెట్స్ గా అభివర్ణిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరిగిన తొలి పోరులో డిఫెండిరగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఏకంగా 9 వికెట్లతో జయభేరి మోగించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచిన కివీస్.. తనను తక్కువగా అంచనా వేయకండి అంటూ మిగిలిన టీమ్స్ కు హెచ్చరికలను జారీ చేసింది. భారత్ తన టైటిల్ వేటను అక్టోబర్ 8న ఆరంభించనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ పోరులో ఐదు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.