- ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు
- సామాన్యుడి పరిస్థితి ఏమిటి.?
- చట్టం అందరికీ సమానమే కాదా..!
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు – ‘ఆదాబ్ హైదరాబాద్’కు ప్రత్యేకం)
హైదరాబాద్ : ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లలో ‘గోల్ మాల్’ జరిగింది. అందుకే ఏదీ బయిటకు రానీయకుండా చేస్తున్నారని ప్రతిపక్షాల వాదన. ఇది అటు ఇటు తిరిగి హైకోర్టు తలుపు తట్టింది. అంతే భవిష్యత్తులో బయటపడే లొసుగులపై ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
అసలేం జరిగిందంటే..?
ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లపై రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?. ఆర్టీఐ ఉన్నది ఎందుకు? ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారంటూ హైకోర్టు ప్రశ్నించింది.
ఆగస్టు 4న మళ్ళీ :
2 వారాల్లోగా రేవంత్ అడిగిన వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధం అని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 4కి కోర్టు వాయిదా వేసింది.
భలే పాయింట్ :
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ నిర్వహణ బదిలీ (టీవోటీ)కి సంబంధించిన సమాచారాన్ని, సమాచార హక్కు చట్ట ప్రకారం కోరినా అధికారులు ఇవ్వడం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 14న దరఖాస్తు చేసినా ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అధికారుల తీరు ఆర్టీఐ చట్టంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను కూడా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.
30 ఏళ్ళ లొల్లి ఏందబ్బా :
తాను మే 1న తొలిసారి దరఖాస్తు చేయగా, మే 23న అరకొర సమాచారం మాత్రమే ఇచ్చారని వివరించారు. దీంతో జూన్ 14న మరోసారి దరఖాస్తు చేశానన్నారు. ఓఆర్ఆర్ లీజు నివేదికలు, 30 ఏళ్లకు ఇవ్వడంపై మంత్రిమండలి నిర్ణయం, 2021–22, 2022–23 సంవత్సరాలలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. లీజు పారదర్శకంగా జరిగిందా? లేదా? తెలుసుకోవడానికి ఈ సమాచారం కీలకం అన్నారు.
తేనె తుట్టే కదిలింది :
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి, ఎండీ(ఎఫ్ఏసీ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం కోరిన సమాచారం ఇచ్చేలా ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఓఆర్ఆర్ నిర్వహణ, టోలు వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్టక్చర్ డెవెలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అదే సామాన్యుడు అడిగితే..
ఇలాంటి సమాచారం ఓ సామాన్యుడు అడిగితే అధికారుల వ్యవహారం ఎలా ఉంటుంది.? హైకోర్టు భవిష్యత్తులో ఇవ్వబోయో తీర్పులో.. ఓ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్యులు అడిగితే కూడా అదే రీతిలో ఉండే విధంగా ఉండాలని సమాచార హక్కు కార్యకర్తలు అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకుంటున్నారు. ఎందుకంటే చట్టం అందరికీ సమానమే కాదా మరి.