- పెట్రోల్ బంక్లకు పోటెత్తిన వాహనదారులు
- ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు
- ట్రక్కు డ్రైవర్ల నిరసనలతో ఆగిన సరఫరా
- న్యాయ సంహిత్ చట్టంలో నిబంధనలపై వ్యతిరేకత
- హిట్ అండ్ రన్ కేసుల్లో ఏడేళ్ల వరకూ జైలు, ఫైన్
- రెండు రోజులుగా ధర్నాలు ఆయిల్ డ్రైవర్ల సంఘాలు
హైదరాబాద్ : ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు. మోటారు వాహనాల చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు నిరసన చేపట్టారు.. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళనతో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందేమోని ఆందోళనకు గురైన వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. అయితే, ట్రక్కు డ్రైవర్ల ధర్నా విరమించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ధర్నా విరమించి, అయిల్ కంపెనీల్లో ట్యాంకర్లను నింపుకుని బయలుదేరారు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు చేర్చడంతో వివిధ ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్లు రాస్తారోకోలు, ర్యాలీలు, నిరసనలకు దిగారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా వాహనాలు క్యూ కట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమోదించిన భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసుల్లో దోషిగా నిర్దారణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ కొత్త నిబంధనలో రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే గరిష్ఠంగా ఈ శిక్ష విధించాలని పేర్కొన్నారు. ఈ నిబంధనను ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల కొత్త వారు ఈ డ్రైవింగ్ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పెట్రోల్ బంకులకు వాహనదారులకు పోటెత్తారు. పెట్రోల్ బంకుల ఎదుట తమ బండ్లతో క్యూ కట్టారు. దీంతో చాలాచోట్ల పెట్రోల్ బంకులు మూసివేశారు. పలుచోట్ల ఏకంగా నోస్టాక్ బోర్డులు పెట్టారు. ఇక స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్దకు జనం పరుగులు తీశారు. కొన్నిచోట్ల క్యాన్లు పట్టుకుని రావటం విశేషం. అయితే తాజాగా ఆ ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. కానీ, పెట్రోల్ బంకుల వద్ద రద్దీ మాత్రం అలాగే ఉంది. సమ్మె విరమణతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పెరగనున్నాయి.