Sunday, May 19, 2024

ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం

తప్పక చదవండి
  • అదేరోజు జెఎన్‌టియులో అవగాహన సదస్సు
  • ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై హాజరు
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈనెల 25 వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులను, జిల్లాల ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాలకు `ఓటింగ్‌కు మించినదేదీ లేదు, నేను తప్పక ఓటేస్తాను అనే అంశాన్ని ఎంపిక చేశారు. కూకట్‌పల్లి జెన్‌టియు ఆడిటోరియంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈకార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరైతారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో విద్యాసంస్థలు మొదలైనవాటిని కూడా భాగస్వాములను చేయాలని, ఉదయం 11 గంటలకు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రతిజ్ఞ తీసుకునేలా ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవాలను నిర్వహించాలని డీఈఓలతో సహా సంబంధిత అధికారులందరికి రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల సంఘం కార్యక్రమాలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఆయన ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో విద్యాలయాల్లో డిబేట్లు, డ్రాయింగ్‌లు మొదలైన వాటిలో పోటీలు, అన్ని బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లు, బ్యానర్‌లను ప్రదర్శించడం, సెమినార్లు, వెబ్‌నార్లు, ప్రకటనలు, ప్రచారాలు మొదలైనవాటిని నిర్వహించడం వంటివి చేపట్లనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో పోస్టల్‌, రైల్వేలు, పంచాయత్‌ రాజ్‌ సంస్థల వంటి ప్రభుత్వ సంస్థలను, సామాజిక సేవా సంస్థలు, ఇతర ప్రజాసంఘాలను కూడా నిమగ్నం చేయాలని సూచించారు. బూత్‌ లెవల్‌ అధికారి స్థాయిలో కొత్త ఓటర్లను సత్కరించి, వారికి కొత్త ఓటర్‌ ఎపిక్‌ కార్డులు జారీ చేయాలని, ఈ కార్యక్రమాలకు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌, పోలింగ్‌ స్టేషన్లలో కనీస సౌకర్యాలు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, నైతిక ఓటింగ్‌, ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌లవంటి వాటికి స్థానిక భాషల్లో ప్రచారం కల్పించడానికి సమాచారాన్ని సృజనాత్మకంగా అభివృద్ధి చేయాలనీ, వాట్సాప్‌ గ్రూపులు, ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా వాటిని ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమాల అమలుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఈవోలందరినీ ఆదేశించారు. ఈసమావేశంలో అదనపు సిఇఓ లోకేష్‌ కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, రోనాల్‌ రోస్‌, కలెక్టర్లు అనుదీప్‌, గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు