Sunday, May 5, 2024

మరోసారి కెప్టెన్లను మార్చిన ముంబై..

తప్పక చదవండి
  • ఆల్‌రౌండర్‌కు సారథ్య పగ్గాలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వచ్చే సీజన్‌కు రోహిత్‌ శర్మను తప్పించి హార్ధిక్‌ పాండ్యాకు ఆ పగ్గాలు అప్పజెప్పిన ముంబై ఇండియన్స్‌ తాజాగా మరో రెండు జట్లకూ సారథులను మార్చింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే ఎస్‌ఎ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్‌)తో పాటు యూఏఈలో జరగాల్సి ఉన్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ఐఎల్‌ టీ20)లకు కొత్త కెప్టెన్‌లను ప్రకటించింది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, దుబాయ్‌, అమెరికాలలో జరిగే టీ20 లీగ్‌లలో ముంబైకి ఫ్రాంచైజీలు ఉన్న విషయం విదితమే. ఈనెల 10 నుంచి దక్షిణాఫ్రికాలో మొదలుకానున్న ఎస్‌ఎ 20లో ఎంఐ కేప్‌టౌన్‌ జట్టును గత సీజన్‌లో నడిపించిన రషీద్‌ ఖాన్‌ స్థానంలో విండీస్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌కు ఆ పగ్గాలు అప్పజెప్పింది. అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు ఇటీవలే ముగిసిన యూఏఈ టీ20 సిరీస్‌లో ఆడలేదు. త్వరలో భారత్‌తో జరగాల్సి ఉన్న సిరీస్‌లో అతడి పేరున్నా ఫైనల్‌ లెవన్‌లో ఉండడని అఫ్గాన్‌ బోర్డు ఇదివరకే స్పష్టం చేసింది. ఇక ఇదే నెల 19 నుంచి దుబాయ్‌లో ఐఎల్‌ టీ20 మొదలుకానుంది. ఈ లీగ్‌లో ముంబై ఎమిరేట్స్‌కు గత సీజన్‌లో పొలార్డ్‌ సారథిగా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు పొలార్డ్‌.. ఎస్‌ఎ 20లో కెప్టెన్‌గా ఉండటంతో అతడి స్థానంలో మరో విండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. ఫిబ్రవరి 17 దాకా ఐఎల్‌ టీ20 జరగాల్సి ఉంది. అయితే ఎస్‌ఎ 20 ముగిసిన తర్వాత పొలార్డ్‌.. ఐఎల్‌ టీ20లో ఆడే అవకాశమున్నట్టు ముంబై వర్గాలు తెలిపాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు