- బీఆర్ఎస్, కాంగ్రెస్ బాక్సులు బద్దలు కావాలే
- 3వ తేదీన కేసీఆర్ మాజీ సీఎం కాక తప్పదు
- కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నడు
- రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి చిప్పచేతికిచ్చారు
- బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏలో బీసీ వ్యతిరేకత
- పూర్తిగా బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
3వ తేదీన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అనక తప్పదు. కేసీఆర్ లేకుంటే నిన్ను కుక్కలు కూడా దేకవు. అమెరికాలో ఆయన ఉన్నతోద్యోగం చేసిండట. నెలకు కోటి రూపాయల జీతం వచ్చేదట. అమెరికాలో చిప్పలు కడిగే బతుకు నీకు. కోటి రూపాయలిస్తారా? అంటే కాస్ట్ లీ చిప్పలు కడిగినవా ఏంది? మరి రాజకీయాల్లోకి వచ్చి అయ్య పేరు చెప్పుకుని లక్ష కోట్లు సంపాదించిన సంగతి జనానికి తెల్వదనుకున్నవా? ముందు ఆ లక్ష కోట్ల సంగతి తేల్చు బిడ్డా…
– బండి సంజయ్
హైదరాబాద్ : రాష్ట్రంలో బీసీ లేదా దళితవర్గ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము బీఆర్ఎస్కు ఉందా అని.. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని.. పరిస్థితులు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కరీంనగర్ పట్టణంలోని స్థానిక కాపువాడలో పాదయాత్ర చేపట్టిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా.. అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. అలాగే కరీంనగర్లో బీఆర్ఎస్ నేతపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ చర్యల వల్ల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని.. గంగుల ఓడిపోతాడని వాళ్ల పార్టీ అధ్యక్షుడే ఆయన బీఫారం ఇవ్వడానికి వెనుకాడారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండిరగ్ చేస్తున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని బండి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకపోయినా ఫర్వాలేదు కానీ.. బీజేపీ మాత్రం గెలవకూడదనే వ్యూహంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై నెలకొన్న ప్రజా వ్యతిరేకత ఓటును చీల్చేందుకు.. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏల్లో బీసీ వ్యతిరేకత ఉంది. రాష్ట్రానికి బీసీ, దళితవర్గ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము బీఆర్ఎస్కు ఉందా.? బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా మారుస్తోంది. గంగుల ఓడిపోతాడని వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఆయన బీఫా రం ఇవ్వడానికి వెనుకాడారని అన్నారు. రాష్ట్రంలో వచ్చిన ఉప ఎన్నికల్లో ఎలాగైతే బీజేపీ అభ్యర్థులను గెలిపించారో.. అదే తరహాలో ఈ శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని బండి సంజయ్ కోరారు. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దాని ప్రస్తావన లేకుండా.. ఎంతసేపు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. బీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో కమీషన్లకు కక్కుర్తి పడటంతో నాణ్యత లోపించిందని.. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన కొద్ది రోజులకే పనికి రాకుండా పోయిందని మండిపడ్డారు.