Friday, May 17, 2024

పురుషుల సీట్లలో పురుషులనే కూర్చోనిద్దాం..

తప్పక చదవండి
  • మేల్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
  • మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో పెరిగిన రద్దీ
  • రద్దీ తో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న పురుషులు
  • ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై దృష్టి పెట్టిన ఆర్టీసీ

హైదరాబాద్ : మహాలక్ష్మీ పధకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది. గతంలో మహిళలకు కేటాయించిన సీట్లలో మహిళలనే కూర్చొనిద్దాం అని అన్ని బస్సుల్లో రాసి ఉండేది.. ఇప్పుడు పురుషులకు కేటాయించిన సీట్లలో పురుషులను కూర్చోనిద్దాం అనే రాసుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి పెరిగిన రద్దీతో ఆక్యుపెన్సీ రేషియో కూడా 20 శాతం వరకు పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. చాలావరకు బస్సుల్లో మగవారికి సీటు దొరకని పరిస్థితి నెలకొంది. అలాగే పలు ప్రాంతాల్లో విద్యార్ధులు సైతం బస్సు ఎక్కేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని బస్సులు మహిళలతోనే నిండి ఉండటంతో.. గత్యంతరం లేక చాలామంది పురుషులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఈ పరిణామాలన్నీ కూడా కండక్టర్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో అవసరమైన మార్గాలు, ప్రత్యేక సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. దీంతో పాటు వృద్దులకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు చేస్తోంది. విద్యార్ధులకు కూడా కొన్ని ప్రత్యేక సర్వీసులు అందించేందుకు చర్చలు జరుపుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారట.
ఉచిత పధకం అమలులోకి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో అక్యుపెన్సీ పెరిగింది. గతంలో 69 శాతంగా ఉన్న ఈ రేషియో.. ఏకంగా 89 శాతానికి పెరిగినట్టు తెలుస్తోంది. గతంలో 12 నుంచి 14 లక్షల మంది మహిళా ప్రయాణీకులు ప్రతీ రోజూ ఆర్టీసీలో ప్రయాణిస్తుంటే.. ఆ సంఖ్య ఇప్పుడు 30 లక్షలకు చేరింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై టీఎస్ఆర్టీసీ యోచిస్తోంది.మొదటిగా పురుషులకు, విద్యార్ధులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని సమాచారం. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో మహిళలకే ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు. మరి దీనిపై టీఎస్ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు