- హాజరైన రఘువీర్, బీఎల్ఆర్, శంకర్ నాయక్
మిర్యాలగూడ (ఆదాబ్ హైదరాబాద్) : మిర్యాలగూడ నియోజకవర్గం లో ఎన్నికల వేళ అధికార బి ఆర్ ఎస్ కు భారీ షాక్ తగిలినట్లు అయింది.ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, గిరిజనులలో పట్టున్న నేతలు మాజీ ఎమ్మెల్సీ ధీరావత్ భారతి రాగ్యనాయక్,వారి తనయుడు, రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, దామరచర్ల మండల ఎంపీపీ నందిని రవితేజ, దామరచర్ల మండలం చెందిన ఒక సర్పంచ్, మరో ఐదుగురు మాజీ సర్పంచులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారం దరూ శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిరిజనుల్లో మంచి పట్టున్న నాయకులుగా ఉన్న వీరు కాంగ్రెస్ పార్టీ లో చేర డంతో మిర్యాలగూడ నియోజకవర్గం తోపాటు నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గా లలో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దివంగత నేత రాగ్యా నాయక్ గతంలో దేవరకొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి సమీప బంధువు లచ్చిరాం నాయక్ కుటుంబానికి పాత చలకుర్తి ప్రస్తుత నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గిరిజనుల్లో మంచి పట్టు ఉంది. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి( బిఎల్ఆర్) తదితరులు పాల్గొన్నారు.