- ఈ నెల 31వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ
- తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల 9 లక్షల పెండింగ్ చలాన్లు
- ఇప్పటి వరకు 1 కోటి 7 లక్షల చలాన్ల చెల్లింపులు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెలాఖరు వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్ల రాయితీ ఇస్తున్నట్టుగా గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండిరగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు గడువును పొడిగించింది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల 9 లక్షల పెండింగ్ చలాన్లు ఉండగా… నేటి వరకు దాదాపు 1 కోటి 7 లక్షల మంది రాయితీతో కూడిన చలాన్లకు సంబంధించిన చెల్లింపులు జరిపారు. దీంతో ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. టూ వీలర్స్, మూడు చక్రాల వాహనాలపై 80 శాతం, కార్లపై 50 శాతం, హెవీ వెహికల్స్ పై 60 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్లపై రాయితీని తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.