Sunday, April 28, 2024

వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం..

తప్పక చదవండి
  • ప్రధానితో బాటు కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్‌ దిగ్గజాలు..
  • నమో అని రాసివున్న జెర్సీని ప్రధానికి బహూకరించిన సచిన్‌..
  • శివతత్వం ఉట్టిపడేలా నిర్మించిన స్టేడియం..
  • బీసీసీఐ రూ. 330 కోట్లు,యూపీ ప్రభుత్వం రూ. 121 కోట్లు వెచ్చిస్తూ నిర్మాణం..

వారణాసి : ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం శంకుస్థాపన కార్యక్ర మంలో భారత క్రికెట్‌ దిగ్గజాలు. సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌, రవిశాస్త్రి, దిలీప్‌ బెంగసర్కార్‌, రోజర్‌ బిన్నీ, మదన్‌ లాల్‌, గుండప్ప విశ్వనాథ్‌, గోపాల్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ ‘నమో’ అని రాసి ఉన్న భారత జెర్సీని ప్రధాని మోడీకి బహుమతిగా ఇచ్చాడు. సచిన్‌తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జే షా భారత ప్రధానికి స్మారక చిహ్నంగా బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు.శివతత్వం ఉట్టిపడేలా స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. శివుడి చేతిలో మోగే ఢమరుకం రూపంలో ఉండే పెవిలియన్‌.. త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్‌ లైట్లు, గంగా ఘాట్‌ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనున్నాయి. చంద్రవంక ఆకారపు పైకప్పు కవరింగ్‌ ఉండనున్నాయి. దాదాపు 30,000 మంది అభిమానులు ఇక్కడ మ్యాచ్‌ను ఒకేసారి వీక్షించవచ్చు. ఈ స్టేడియం నిర్మాణ పనులు డిసెంబర్‌ 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. వారణాసి స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. ‘మణిపూర్‌లో జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో క్రీడా రంగానికి కోట్లాది రూపాయలను గ్రాంట్‌ ఇచ్చామని తెలిపారు . గోరఖ్‌పూర్‌లోని స్పోర్ట్స్‌ కాలేజీ, మీరట్‌లోని మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ సహా దేశవ్యాప్తంగా అనేక క్రీడా కేంద్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశం అభివృద్ధి కోసం క్రీడా సౌకర్యాల భారీ విస్తరణ అవసరం. మనలో చాలా మందికి ప్రపంచంలోని అనేక నగరాలు తెలుసు. ఎందుకంటే వారు వివిధ అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించారు. అలాంటి క్రీడా కేంద్రాన్ని భారత్‌లోనూ నిర్మిస్తాం. దీని కారణంగా అంతర్జాతీయ స్థాయి వివిధ ఆటలను కూడా ఇక్కడ నిర్వహించవచ్చు. ఈరోజు శంకుస్థాపన చేసిన ఈ స్టేడియం క్రీడల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం’ అని అన్నారు. వారణాసిలో నిర్మించనున్న మహదేవన్‌ నగరి స్టేడియం గురించి మోడీ మాట్లాడుతూ.. ‘వారణాసి స్టేడియం కేవలం ఇటుకలు, రాళ్లతో నిర్మించే స్టేడియం కాదు. ఈ స్టేడియం భవిష్యత్‌ భారతదేశానికి చిహ్నంగా మారుతుంది. మహాదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని ఆ మహాదేవుడికే అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ స్టేడియంలో అనేక క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతాయని వారణాసిలో క్రికెట్‌ ఆడాలనుకునే యువతకు స్టేడియం ఉపయోగపడుతుందన్నారు. తనను తాను అదృష్టవంతుడిగా భావిస్తానని.. ఎందుకంటే తనను ఎప్పుడూ కాశీ అనుగ్రహిస్తుంది. శివయ్య తన పక్కనే నిల్చున్నా డని మోడీ చెప్పారు. కాశీలో అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించామని పేర్కొన్నారు. వారణాసిలోని రాజతలాబ్‌ ప్రాంతంలోని గంజరి అనే గ్రామంలో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ స్టేడియం కోసం రూ. 450 కోట్లు అంచనా వ్యయం కాగా భూసేకరణ కోసం ఇదివరకే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 121 కోట్లు వెచ్చించింది. బీసీసీఐ రూ. 330 కోట్లు వెచ్చించి స్టేడియం నిర్మాణం చేపడుతోంది. దీని నిర్మాణ కాంట్రాక్టును ప్రముఖ సంస్థ ఎల్‌ అండ్‌ టీ దక్కించుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు