Sunday, May 19, 2024

గడీల పాలన గ్రామాలకు..

తప్పక చదవండి

ప్రజల వద్దకు వెళ్లేందుకు ‘ప్రజా పాలన’..
ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారం విడుదల

  • నేటి నుంచి 8రోజులు గ్రామసభలు
  • ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తం
  • ప్రజల సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం
  • రేషన్‌ కార్డులు లేని వారూ కార్డులు
  • అవసరమైన వారందరికి కార్డులూ
  • మేడిగడ్డపై విచారణ సాగుతోంది
  • అప్పులకుప్పను చేసి.. ఖాళీ బిందెలు ఇచ్చారు
  • ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ నియామకాలు
  • ఇప్పటివరకు ప్రజావాణిలో 24వేల దరఖాస్తులు
  • త్వరలోనే గ్రూప్‌ 2 పై నిర్ణయం తీసుకుంటాం
  • మీడియాతో సీఎం రేవంత్‌ రెడ్డి

త్వరలోనే గ్రూప్‌ 2పై నిర్ణయం
టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 2 పై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. కమిషన్‌ కు చైర్మన్‌ ను, పాలకమండలి నియమించాల్సి ఉందని, అవి పూర్తయితేనే పరీక్షల నిర్వహణకు ముందడుగు వేయవచ్చని చెప్పారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

హైదరాబాద్‌ : గడీల మధ్య ప్రజలకు దూరంగా జరిగిన పాలనను గ్రామాలకు తీసుకువస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు తెలిసింది. బాధిత మహిళకు ఆయన లక్ష సాయం అందించారు. కేటీఆర్‌ దోచుకున్న లక్షకోట్ల రూపాయల్లో బాధితురాలికి లక్ష ఇచ్చారు. దోచుకున్న సొమ్ము మొత్తం ప్రజలకు చేరేలా చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 22 కొత్త కార్లు కొని దాచి పెట్టారని అన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే వాటిని వాడుదామనుకున్నారని చెప్పారు. కేసీఆర్‌ సంపద సృష్టి ఈ విధంగా ఉందన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు వెనక్కి పోతే కేంద్రాన్ని నిలదీయలేని వారు ఇవాళ విమర్శలు చేస్తున్నారని అన్నారు. రేషన్‌ కార్డుల జారీ నిరంతర పక్రియ అన్నారు. అలాగే తాము ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ లేకుండా పరీక్షల పక్రియ జరగదు. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నాక కొత్త బోర్డును ఏర్పాటు చేసి ఛైర్మన్‌, సభ్యులను నియమిస్తాం. అనంతరం ఉద్యోగ నియామకాలు చేపడతాం. గ్రూప్‌` 2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత ఎల్‌ అండ్‌ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుంది. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశాం.6.71లక్షల కోట్లు అప్పులు చేసి నిండా ముంచారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబడతాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించాం. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటాం. నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తే పథకాలకు ఉపయోగపడుతుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూస్తే.. ఖాళీ బిందలే ఉన్నాయి.. కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకుని వెళ్లిందంటూ స్పష్టం చేశారు. మేం లంకె బిందెలు అని వస్తే.. ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని.. ఇప్పుడు అంతా సెట్‌ రైట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పథకం డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. గతంలో నాలుగు నెలలపాటు వేస్తూ వచ్చారని.. గత ఏడాది డిసెంబర్‌ 28వ తేదీన మొదలుపెట్టారని.. ఇప్పుడు డిసెంబర్‌ 20వ తేదీ నుంచి నిధుల జమ చేస్తూ వస్తున్నట్లు వివరించారు. కేసీఆర్‌ ప్రభుత్వం.. అన్ని ఖాతాలను ఖాళీ చేసి వెళ్లాడని.. ఖాజానా ఖాళీ చేసి వెళ్లాడని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. గత పదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని, ప్రజావాణిలో వచ్చిన 24 వేల ఫిర్యాదులే అందుకు ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని గత పదేళ్లలో మోసారని అన్నారు. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తోందన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు తమ మీద మరింత విశ్వాసం కలుగుతుందన్నారు. గతంలో గడీల మధ్య పాలనా నడిచిందని.. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల కోసం వారి వద్దకు వెళ్తుందన్నారు. ఒకప్పుడు సచివాలయం అంటే ఏదో తెలియదని, సచివాలయం లోపల మీడియా సమావేశం ఉంటుందని ఎవరైనా ఊహించారా అని అడిగారు. ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్‌ ఉంటుందన్నారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. గతంలో ఎల్‌ అండ్‌ టి కట్టిన భవనాలు ఇక్కడ ఉండేవని, ఈ భవనాలను ఏ ఆస్పత్రికో ఉపయోగించి, మరోచోట సచివాలయం కట్టివుంటే నిధులు ఆదా అయ్యేవని అన్నారు. ఇలా ఎందుకు కట్టారో తెలియంది కాదన్నారు. కేటీఆర్‌ తన లక్ష కోట్ల దోపిడీలో లక్ష రూపాయలు సహాయం చేసేలా చేశామన్నారు. త్వరలో కూడా మరిన్నీ కూడా కక్కించే పరిస్థితి తీసుకువస్తామన్నారు. అసెంబ్లీ బావ బామర్థులు ఆరాటమే కనిపించిదని.. మేం అసెంబ్లీలో వాస్తవాలు చెప్పామన్నారు. ప్రజావాణి వందకు వంద శాతం పూర్తి అవుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సైనిక్‌ స్కూల్‌ ఎందుకు ఆగిందో బీఆర్‌ఎస్‌ వాళ్లే చెప్పాలన్నారు. కేసీఆర్‌ 22 ల్యాండ్‌ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు. మూడోసారి సీఎం అయ్యాక వాటిని వాడాలని అనుకున్నారని తెలిపారు. ఒక్కో ల్యాండ్‌ క్రూజర్‌ ధర రూ. 3 కోట్లు ఉంటుందన్నారు.
2 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే.. తాము అప్పుల కంటే ఆస్తులను సృష్టించి.. రాష్ట్రానికి అందించామని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. ఈ రెండు పార్టీల మధ్య మరో కొత్త విషయం ప్రజలకు తెలిసింది. బీఆర్‌ఎస్‌ వాళ్లు ఆస్తులు కాదు.. అప్పులు చేసి వెళ్లారంటూ తనదైన స్టైల్లో చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. కాన్వాయ్‌ కోసం నేను కొత్త బండ్లు కొనను.. ఖర్చు పెట్టను అని ముందుగానే అధికారులకు చెప్పాను. పాతబండ్లనే రిపేర్‌ చేసి, అడ్జెస్ట్‌ చేసి ఇవ్వండి అని అధికారులకు చెప్పాను. అయితే.. నేను సీఎం అయిన10 రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 22 కొత్త ల్యాండ్‌ క్రూజర్లు కొని దాచి పెట్టింది. ఈ విషయాన్ని ఓ అధికారి వచ్చి నాతో చెప్పాడు. కొత్త 22 ల్యాండ్‌ క్రూజర్లను విజయవాడలో దాచి పెట్టాం. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మళ్లీ తీసుకొద్దామని అనుకున్నామని చెప్పాడని తెలిపారు. అసలు ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా..? అని ప్రశ్నించారు. ఒక బండికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్‌ ప్రూఫ్‌ చేయిస్తే.. ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఇలాంటివి కేసీఆర్‌ సృష్టించిన సంపద అని చెప్పారు. 22 కొత్త ల్యాండ్‌ క్రూజర్ల వాహనాలు ప్రభుత్వ ఆస్తి.. తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజా పాలన నిర్వహణకు నోడల్‌ అధికారుల నియామకం
ఈ ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకుగానూ ఉమ్మడి జిల్లాలకు ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్‌ లను నోడల్‌ అధికారులగా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.

నోడల్‌ అధికారులు వీరే :
ఆదిలాబాద్‌ – ఎం. ప్రశాంత్‌
కరీంనగర్‌ శ్రీదేవసేన నిజామాబాద్‌ - క్రిస్టినా చోంగ్తూ వరంగల్‌ వాకాటి కరుణ
మెదక్‌ ఎస్‌. సంగీత హైదరాబాద్‌ కె.నిర్మల
రంగారెడ్డి ఇ.శ్రీధర్‌ మహబూబ్‌నగర్‌ టి.కె.శ్రీదేవి
నల్గొండ ఆర్వీ కర్ణన్‌ ఖమ్మం ఎం.రఘునందన్‌రావు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు