- నాంపల్లి స్టేషన్లో ప్రమాదం
- 10 మందికి గాయాలు
నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను రైలు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రైలులోని 10 మంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆకస్మాత్తుగా జరిగిన పరిణామంతో పలువురు ప్రయాణికులు గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రయాణీకులందరూ క్షేమంగా ఉన్నారని.. కొందరు మాత్రం స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు. ప్రమాదం జరిగే సమయానికే రైలులోని ప్రయాణీకులు దిగిపోయారని.. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో కొందరు ఆందోళనకు గురయ్యారని వెల్లడించారు. లోకో పైలట్ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్కు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని.. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు.