Monday, May 6, 2024

కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను కొనసాగిస్తున్నాం: బీసీసీఐ

తప్పక చదవండి

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ లో పరాజయం తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ను కొనసాగిస్తారా? లేదా మారుస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ద్రవిడ్‌ స్థానంలో హైదరాబాదీ ప్లేయర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను కోచ్‌గా తీసుకుంటారని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ రూమర్లన్నింటికి చెక్‌ పెడుతూ తాజాగా హెడ్‌ కోచ్‌ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువరించింది. భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో అతను ఇప్పుడు టీమిండియాతో కలిసి కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నాడు. మళ్లీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంపై రాహుల్‌ ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తనపై నమ్మకం ఉంచిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. తన ప్రణాళికకు, విజన్‌కు బీసీసీఐ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబ సభ్యులకు రాహుల్‌ ద్రవిడ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రపంచకప్‌ తర్వాత తన ముందు కొత్త సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు. మరోవైపు బీసీసీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీ, సెక్రటరీ జై షా కూడా టీమ్‌ ఇండియాతో కలిసి ఉన్నందుకు రాహుల్‌ ద్రవిడ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ద్రవిడ్‌ ప్రస్థానం అద్భుతమని జై షా అన్నాడు. ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి తన సత్తాను నిరూపించుకుంది, ఇందులో రాహుల్‌ ద్రవిడ్‌ పాత్ర చాలా ఉంది. ఈ ప్రదర్శన కారణంగా రాహుల్‌ ద్రవిడ్‌ మళ్లీ ప్రధాన కోచ్‌ అయ్యే అర్హత సాధించాడని జై షా అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు రాహుల్‌ ద్రవిడ్‌ ముందుకు వెళ్లేందుకు అన్ని విధాలా సాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కాంట్రాక్టును ఎంతకాలం పొడిగించారనేది వెల్లడికాకపోయినా అతని ముందు పెద్ద సవాల్‌ ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. టీ20 ప్రపంచ కప్‌ వచ్చే ఏడాది జూన్‌లో జరగనుంది. ఈ మెగా టోర్నీనే లక్ష్యంగా చేసుకుని ద్రవిడ్‌ తన ప్రణాళికలను అమలు చేయనున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు