- ఎన్నికల సమరశంఖం పూరించేందుకు డేట్ ఫిక్స్..
- ఈనెల 16, 17 తేదీలలో హైదరాబాద్ లో సి.డబ్ల్యు.సి. సమావేశాలు..
- పాల్గొననున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు..
- తెలంగాణ విలీన దినోత్సవం ఘనంగా జరపాలని నిర్ణయం..
హైదరాబాద్ :
తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు ముహుర్తాన్ని ఖరారు చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 16, 17న హైదరాబాద్ లో జరిగే సి.డబ్ల్యు.సి. సమావేశాల్లో సోనియా గాంధీ , మల్లిఖార్జున ఖర్గే ,రాహుల్, ప్రియాంక గాంధీలు సహ పార్టీ అగ్ర నాయకులంతా పాల్గొంటారు. ఇక తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని అదే రోజు..సోనియాగాంధి ముఖ్యఅతిథిగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేత పర్యటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సీఎంలు, మంత్రులు మొదలుకుని సీనియర్ నేతలు ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. తద్వారా తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు కావడం లేన్న గులాబి నేతల ప్రచారానికి చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. రాజస్థాన్, ఛత్తీస్ఘడ్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు వివరించనున్నారు.
రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు, అక్కడి అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయనే విషయాన్ని తెలంగాణలో ప్రచారం చేస్తే..ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. దీంతో పాటు పార్టీ అగ్రనాయకత్వం అంతా తెలంగాణలో పర్యటిస్తే.. తెలంగాణకు కాంగ్రెస్కు అధిక ప్రధాన్యతనిస్తుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతాయని..తద్వారా కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ వైపు తిరిగి వస్తారని భావిస్తున్నారు. ఎన్నికలు ఉన్న ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఈ వ్యూహన్ని అమలు చేసి లబ్ది పొందుతున్నట్లుగానే.. పార్టీ ముఖ్యులందరిని ఏకకాలంలో తెలంగాణలో పర్యటింప చేయడం ద్వారా ఎన్నికల వాతావరణం కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన CWC సమావేశాలను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తేదిల్లో స్వల్ప మార్పులు జరిగినా సెప్టెంబర్ మూడో వారంలో CWC సమావేశాలు హైదరాబాద్ లో జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాలను వచ్చే ఎన్నికలకు వాడుకునేందుకు టీ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ మేనిఫెస్టోను భాగా ప్రచారం చేయాలని చూస్తున్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక 17వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభలో సోనియా గాంధీ స్పీచ్ తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండేలా సునీల్ టీం స్పీచ్ రెడీ చేస్తుందట. మొత్తానికి సీడబ్ల్యూసీ సమావేశాలను తెలంగాణ ఎన్నికల కోసం అన్ని రకాలుగా వాడుకునేందుకు టీ కాంగ్రెస్ సిద్దమయింది. చూడాలి మరి హైదరాబాద్ వేధికగా జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు టీ కాంగ్రెస్ కు ఏ మేరకు ఉపయోగపడతాయో.