- తొలి ఫోటోలను పంపిన రోవర్..
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజ్ఞాన్ పంపిన జాబిల్లి ఫొటోలు..
- 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై సంచరిస్తూ
అక్కడి విలువైన సమాచారాన్ని భూమికి చేరవేయనున్న ప్రజ్ఞాన్..
బెంగుళూరు :
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ ఘన విజయం సాధించింది. బాబిల్లిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. దీంతో ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టి ఇస్రో సరికొత్త రికార్డు సాధించింది. చంద్రుడి ఉపరితలంపై బుధవారం (ఆగస్టు 23) ల్యాండర్ను సేఫ్గా ల్యాండింగ్ చేసింది. దీంతో ప్రపంచంలోనే ల్యాండర్ను దింపిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధించింది. రష్యా ల్యాండర్ లూనా 25 విఫలమైన చోటే భారత్ లూనార్ విజయవంతంగా దిగడం దేశానికే గర్వకారణం. దాదాపు 41 రోజులపాటు భూమి నుంచి చంద్రుడి దిశగా ప్రయాణించిన చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగంలో భాగంగా ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ బుధవారం సాయంత్రం 6.04 గంటల సమయంలో చందమామ మీద అడుగిడింది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అవడంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానని నరేంద్ర మోదీ, వివిధ కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. సేఫ్ ల్యాండింగ్ అనంతరం 4 గంటల అనంతరం రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుంచి బయటకు అడుగుపెట్టింది. జాబిల్లి ఉపరితలంపై సంచరిస్తూ ఫొటోలు సైతం పంపింది. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ పంపిన మొదటి ఫొటోలు ఇవే.. చందమామపై అడుగు పెట్టిన వెంటనే రోవర్ చంద్రుడి క్లోజప్ ఫొటోలు తీసి పంపింది. దక్షిణ ధృవంపై మొత్తం 4 ఫొటోలను బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ పంపిన జాబిల్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా రెండు వారాల (14 రోజుల) పాటు చంద్రుడి ఉపరితలంపై సంచరిస్తూ అక్కడి విలువైన సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. కాగా ప్రపంచంలో ఇప్పటి వరకూ 12 దేశాలు చంద్రుడి మీద 141 ప్రయోగాలు చేశాయి. కానీ ఏ దేశం ఇప్పటి వరకూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేకపోయింది. చంద్రయాన్ 2 వైఫల్యం నుంచి పొరబాట్లు దిద్దుకుని అన్ని అవరోధాలను అధిగమించి నిర్దేశిత సమయానికే ల్యాండర్ను దించనున్నారు.