- బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లోకి వలసలు
- ఇంచార్జీగా ఎంపి రంజిత్ రెడ్డి వచ్చినా ఫలితం శూన్యం..!
- ఉన్న కొద్దిపాటి నాయకుల్లోనూ వర్గ పోరు బెడద
- మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్న
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ : వికారాబాద్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.అయితే ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయడం ఒక కారణమైతే, బిఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత సైతం కు కారణంగా కనిపిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు బిఆర్ఎస్ పార్టీని ఆదరించే పరిస్థితి ఏమాత్రం లేదని మరి మాటల్లోనే స్పష్టమవుతుంది. ఇకపోతే వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఉన్న వ్యతిరేకత కారణంగా పలువురు ముఖ్య నాయకులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడమే గాక బిఆర్ఎస్ అభ్యర్థిని ఒడిరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఇదిలా ఉంటే వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా ఎంపీ రంజిత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసి ఆయా పార్టీల నుండి పలువురు నాయ కులను బిఆర్ఎస్ లోకి ఆహ్వానించినప్పటికీ కొత్త నాయకుల రాకతో పాత వారికి ప్రాధాన్యత తగ్గుతుం దని భావిస్తూ కొందరు నాయకులు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం ద్ గెలుపే లక్ష్యంగా కంటిమీద కునుకు లేకుండా ఎంపీ రంజిత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్న కూడా వలసల పర్వం ఆగడంలేదు. ఎన్నికల ప్రచారానికి ఇంకా మిగిలి ఉన్నది 15 రోజులే కావడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో వేగం పెంచారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికారాబాద్ నియోజ కవర్గంలో బిఆర్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి మరి.
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్….
వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఏ గ్రామానికి వెళ్లిన అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కెసిఆర్ సర్కార్ ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలుకాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలకు సంబంధించి ఆరు గ్యారెంటీ హామీల కార్డును ప్రజలకు వివరించడంతో కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ శాతం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.రెండు దఫాలు ఓటమి చెందినా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ,కేసీఆర్ సర్కార్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు.ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులు స్వచ్చందంగా ప్రచారం సాగిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో వికారాబాద్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విశేష ఆదరణ లభిస్తుందనీ చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.