- మందు.. విందు.. చిందులకు షరతులు
- డ్రగ్స్, పబ్ లపై నిఘా పెట్టిన పోలీసు
- బార్, పబ్, క్లబ్లకు సూచనలు జారీ
- డ్రగ్స్ వినియోగిస్తే 10 ఏండ్లు జైలు శిక్ష
- రంగంలోకి ప్రత్యేక పోలీసులు బృందాలు
- మద్యం సేవించి వాహనం నడిపితే అంతే..
- సాధారణ ప్రజలకు సైతం ఆంక్షలు అమలు
కొత్తేడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ప్రజలంగా సిద్ధమవుతున్నారు. పాతేడాదికి వీడ్కోలు చెప్పేందుకు ఇప్పటికే కొందరు ట్రిప్స్ కూడా ప్లాన్ చేశారు. ఇక డిసెంబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాద్లో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు..
హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకోవడంలో హైదరాబాదీలు ముందుంటారు .. 31 వ తేదీ రాత్రి సెలబ్రేషన్స్ అంటేనే మందు.. విందు.. చిందు..! ఈ సరదా సమయంలో మత్తు తోడైతే..! మరింత మజా. ఈ గమ్మత్తైన అనుభూతి పొందేందుకు సిటీ పార్టీ లవర్స్ తెగ ఆరాటపడుతుంటారు. ఇలాంటి వారే టార్గెట్గా నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ రారమ్మని పిలుస్తున్నాయి. ఒకప్పుడు సెలబ్రిటీ ఈవెంట్లు, థీమ్ ఓరియెంటెడ్ ఈవెంట్లు, టాప్ డీజే ప్లేయర్స్ ఉన్న ఈవెంట్లకు ఇంపార్టెన్స్ ఇచ్చే పార్టీ లవర్స్.. తీరు మారింది. ఎక్కడ మత్తు దొరుకుతుందో అక్కడికే వాళ్ల ప్రిఫరెన్స్. అది పబ్ అయినా.. హోటల్ అయినా.. చివరకు సర్వీస్ అపార్ట్మెంట్ అయినా….
థర్టీ ఫస్ట్ నైట్ వేడుకల మాటున యువతకు మత్తు పంచేందుకు డ్రగ్స్ మాఫియా ఇప్పటికే నగరానికి డంప్ అయ్యింది. పార్టీల పట్ల మోజుండి అందుకు సరిపడా ఆర్ధిక స్థోమత లేని వారిని సైతం ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఫ్రీగా ఈవెంట్ పాస్లిచ్చి వారితో డ్రగ్స్ అమ్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నగర చరిత్రలో తొలిసారి ఈ తరహా దందాకు మత్తు వ్యాపారులు తెరతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెంట్ నిర్వాహకుల సహకారంతో కొన్ని చోట్ల డ్రగ్స్ విక్రయాలు జరగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వారికి సమాచారం లేకుండా రహస్యంగా అమ్మేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ చేసుకుని.. డ్రగ్స్ను భారీ స్థాయిలో విక్రయించేందుకు ముఠాలు నగరానికి చేరుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఓ వైపు పోలీసులు ఎన్నికల హడావిడిలో ఉండగా.. అదే అనువుగా భావించిన డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్కు భారీగా డ్రగ్స్ చేరవేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో డ్రగ్ పెడలర్స్ కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. డ్రగ్స్ తరలించే అన్ని మార్గాలపైనా పోలీసులు దృష్టి సారించారు. అయితే.. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్ పెడలర్స్ వాటిని చేర్చాల్సిన చోటుకి చేర్చేస్తున్నారు.
డ్రగ్స్ కదలికలపై నిఘా పెట్టిన అధికారులు.. 24గంటల్లోనే నాలుగు చోట్ల భారీగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు వీరిని విచారిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. గోవా నుండి పెద్ద ఎత్తున సిటీకి డ్రగ్స్ సరఫరా జరిగిందని.. రైలు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులతో పాటు.. కొరియర్స్లలో కూడా వాటి వ్యాపారులకు అందినట్టు పోలీసులు కనుగొన్నారు. ఇప్పటికే నగరంలో భారీగా డ్రగ్స్ చేరిందన్న విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు పోలీసులు.
డ్రగ్స్ ఎవరు వినియోగించినా…. ఎవరు విక్రయించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎవరు డ్రగ్స్ వినియోగించినా కనీసం పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు. ప్లవర్ బోకేస్, కొరియర్స్, గిఫ్ట్ ప్యాక్ల ద్వారా కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు చెప్పడంతో.. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిటీలో కంటే.. నగర శివారు ప్రాంతాల్లో జరిగే వేడుకలకు హజరయ్యేందుకే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో అక్కడే ఎక్కువగా మాదక ద్రవ్యాల వినియోగం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాటిని సమర్ధవంతంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవ్ పార్టీలు.. వీకెండ్ నైట్స్.. సెలబ్రేషన్స్తో పాటు.. రిసార్ట్.. హోటల్స్.. పబ్స్పై ప్రత్యేక నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు పోలీసులు.
సాధారణ ప్రజలకు సూచనలు..
ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ & డ్రైవింగ్పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు.సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా పోలీస్ వారు వారి తమ కస్టడీలోకి తీసుకుంటారు.చట్ట ప్రకారం పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించడంతో పాటు పత్రాలను చూపించడం వాహన డ్రైవర్ల విధి. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని నిర్బంధంలోకి తీసుకోబడును, వాహన యజమాని, డ్రైవర్ ఇద్దరూ న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేయబడతారు.వాహనాలలో అధిక-డెసిబెల్ సౌండ్/మ్యూజిక్ సిస్టమ్లను ఉపయోగించడం నిషేధించబడింది. ఒకవేళ అలా చేస్తే తదుపరి చర్యల కోసం వాహనాలు నిర్బంధించబడతాయి మరియు ఆర్టీఓ అధికారికి పంపబడతాయి.నంబరు ప్లేట్లు లేని వాహనాలు నడిపితే, ఆ వాహనాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు.వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం/వాహనాల పై భాగంలో ప్రయాణించడం/బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.ట్రాఫిక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన శబ్దాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్/మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై తగిన కేసులను బుక్ చేస్తారు.పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా, బాధ్యతతో మరియు సురక్షితంగా ప్రయాణించాలి.
మద్యం సేవించి వాహనం నడిపితే..
మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని యు/ఎస్ 185 డిడి కేసులు బుక్ చేస్తారు. వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టుకు హాజరుపరుస్తారు.మొదటి నేరానికి జరిమానా రూ. 10000 లేదా 6 నెలల వరకు జైలు శిక్ష. రెండవ లేదా అంతకంటే ఎక్కువసార్లు నేరానికి పాల్పడితే రూ. 15000 మరియు లేదా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 19 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం వారి డ్రైవింగ్ లైసెన్స్లను స్వాధీనం చేసుకుని సంబంధిత ఆర్టీవో లకు పంపిస్తారు.మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఎవరైనా రోడ్డు ప్రమాదానికి పాల్పడి, మరణానికి కారణమైనట్లయితే, ఐపీసీలోని యు/ఎస్ 304 పార్ట్-II క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు.