- చనిపోయి ఉంటాడన్న అనుమానాలు
లాహోర్ : వరల్డ్ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది మసూద్ అజహార్(55) మృతి చెందాడని ప్రచారం సాగుతోంది. ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్ చనిపోయినట్లు సమాచారం. 1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది ఇతని విడుదల కోసమే. భారత పార్లమెంట్పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు కారణమైన జేషే మహమ్మద్ సంస్థను స్థాపించింది అజహారే. మహమద్ మసూద్ అజహార్ అల్వీ.. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ స్థాపకుడు. సోమవారం ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మసూద్ అజహార్ మృతిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పాక్లో గత కొంతకాలంగా ఉగ్రవాదులు.. ఉగ్ర సంస్థల నేతలు మిస్టరీ పరిస్థితుల్లో మృతి చెందుతున్న సంగతీ తెలిసిందే. పాక్ పంజాబ్ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అజహార్.. కశ్మీర్ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలకు దిగాడు.బ్రిటన్కు జిహదీని పరిచయం చేసింది ఇతనే. భారత్ ఇతన్ని అరెస్ట్ చేస్తే.. ఇతని విడుదల డిమాండ్తో ఏకంగా విమానం హైజాక్ చేశారు. కాందహార్ హైజాక్ ఘటనగా భారత్కు ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. జైల్లో ఉన్నప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు.. ఇంటర్పోల్ సైతం ఇతన్ని గతంలో ప్రశ్నించాయి. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1994లో అజహార్ ఫేక్ ఐడీ విూద శ్రీనగర్కు చేరుకున్నాడు. అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేయాలనుకున్నాడు. అయితే భారత భద్రత బలగాలు ఫిబ్రవరిలో అనంతనాగ్ జిల్లా ఖానాబల్ దగ్గర అజహార్ను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. చివరకు.. 1999 డిసెంబర్లో మసూద్ అజహార్ సానుభూతి పరులు ఇండియన్ఎయిర్లైన్స్ విమానం 814ను హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. ఆ సమయంలో కాందహార్ పాక్ ఐఎస్ఐ మద్దతుతో తాలిబన్ల ఆధీనంలో ఉండేది. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారానికి అజహార్ సోదరుడు అబ్ధుల్ రౌఫ్ అజహార్ నేతృత్వం వహించాడు. విమాన ప్రయాణికుల విడుదల కోసం జరిపిన దౌత్య పరమైన చర్చలు విఫలం కావడంతో.. అప్పటి భారత ప్రభుత్వం అజహార్ను విడుదల చేయాల్సి వచ్చింది. కోట్ భల్వాల్ జైలు నంచి అప్పటి పోలీస్ అధికారి శేష్ పాల్ వైద్ నేతృత్వంలో అజహార్ అప్పగింత జరిగింది. ఆ తర్వాత ఐఎస్ఐ సంరక్షణలోనే చాలా కాలం అజహార్ పాక్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాడు. అయితే పాక్ మాత్రం అజహార్ తమ దగ్గర లేడంటూ బుకాయిస్తూ వచ్చింది. 1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న ఎఐ`814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్ విూదుగా కాందహార్కు చేర్చారు. అక్కడ ఆ విమానం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. ఈ హైజాక్ వ్యవహారంలో.. 25 ఏళ్ల భారత ప్రయాణికుడు రూపిన్ కట్యాల్ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాది అజహార్ను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు.