- పార్టీనుంచి జంప్ అవనున్న మోత్కుపల్లి..
- కేసీఆర్తో పడక కాంగ్రెస్లో చేరేందుకు సిద్దం..
- కర్నాటక డిప్యూటి సీఎం డీకేతో చర్చలు..
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్ తీరుతో గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, మాజీమంత్రి, దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్తో బెంగళూరులో భేటీ అయ్యారని సమాచారం. తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని మోత్కుపల్లి భావిస్తోన్నట్లు సమాచారం. బెంగుళూరు కేంద్రంగా రాజకీయ మంతనాలు జరుపుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం భేటీ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికపై ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నట్లు సమాచారం. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో ఆయన త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ ఎన్టీఆర్ ఘాట్లో నిరహార దీక్ష కూడా చేశారు. ఆ సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనకు తమ్ముడు లాంటి వారని చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా మోత్కుపల్లి దూరంగా ఉంటు వస్తున్నారు. పలుమార్లు సీఎం కేసీఆర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగినా ప్రగతి భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. పార్టీలో చేరిన సమయంలో సీఎం కేసీఆర్ కీలక పదవీ ఇస్తారని హావిరీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీలో చేరిన కొత్తలో యాదగిరి నర్సన్న ఆలయానికి కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన వెంట మోత్కుపల్లి తిరిగారు. ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ వెన్నంటి నడిచారు. ఏమయిందో కాని గత కొంతకాలంగా కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులును దూరంగా పెడుతూ వస్తోన్నారు. దీంతో మోత్కుపల్లి బీఆర్ఎస్ అధిష్ఠానం, సీఎం కేసీఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారం రోజుల క్రితం ఘాట్కెన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.