- మీ ఖాతా నుంచి డబ్బుల్ కట్..?
- ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి..
- హెచ్చరిస్తున్న సైబర్ సెక్యూరిటీ పోలీసులు..
హైదరాబాద్ : లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. ఈ లక్కీడ్రాలో మీరు ఐఫోన్ 15ని గెలుపొందారు. ఈ రివార్డును క్లెమ్ చేసుకోవడానికి ‘క్లిక్ అండ్ కంటిన్యూ’ బటన్ ప్రెస్ చేయండి’ అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరతీశారు.
‘ఇండియా పోస్ట్ వినాయక చవితి సందర్భంగా ఐఫోన్ -15ను గిఫ్టుగా ఇస్తున్నది. దీనికోసం ఈ సమాచారాన్ని 5 వాట్సాప్ గ్రూ పుల్లో ఫార్వర్డ్ చేయాలి’ అంటూ క్లోనింగ్ చేసిన (సైబర్ నేరం చేసేందుకు వీలుగా ఉండే) ఇండియా పోస్టు వెబ్సైట్ పేరిట ఉండే పోస్ట్ను ఫార్వర్డ్ చేయిస్తున్నారు. ఈ మెస్సేజ్ ‘ఇండియా పోస్ట్’ నుంచే వచ్చిందనే భ్రమలో కొందరు అమాయ కులు ఈ కొత్త తరహా మోసాల బారిన పడుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రచా రాన్ని ప్రజలు నమ్మవద్దని, తాము ఎవరికీ బహుమతులు ఇవ్వబోమని ఇండియా పోస్ట్ ఎక్స్ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చింది. సైబర్ నేరస్తులు పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఇలాంటి మోసాలకు తెగబడ్తారని, అప్రమత్తతే ఆయుధమని సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెబుతున్నారు. వీటిని క్లిక్ చేస్తే డబ్బులు కొల్లగొడతారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాలబారిన పడినవారు 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.